TIRUMALA || ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప..
తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు;
తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకంలో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు. అంతకుముందు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అర్చకులు, వేద పారాయణ దారులు శాస్త్రోక్తంగా మహా శాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారికి, దేవేరులకు అభిధేయక అభిషేకాన్ని కన్నుల పండువగా చేపట్టారు.
సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి వారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామి వారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్స్వమి, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.