'నాపై స్టేట్ స్పాన్సర్డ్ దాడి జరగబోతోంది'-వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల వేళ మంత్రి లోకేష్ పై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సంచలన ఆరోపణలు చేసారు.;

Update: 2025-08-10 09:37 GMT

పులివెందులకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు,పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పులివెందుల జెడ్పీ ఎన్నికలను అడ్డుగా పెట్టుకుని తనపై దాడి చేయడానికి కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు.ఈ దాడి స్టేట్ స్పాన్సర్డ్ అని సతీష్ రెడ్డి ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే మంత్రి నారా లోకేష్, బీటెక్ రవి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వారిద్దరినీ సుమోటోగా తీసుకుని సీబీఐతో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై జరగబోయే దాడి గురించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారని సతీష్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి పోలీసులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారంటూ ,ఇక్కడున్న పోలీసుల ద్వారా న్యాయం జరిగే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.తనను కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసులదేనని అన్నారు.చేతనైతే తనను కాపాడాలని, దాడి జరగకుండా చూడాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.డీఎస్పీ, రూరల్ సీఐ, డీఐజీ సైతం టీడీపీ వాళ్లకు పెత్తనం ఇచ్చారని ఆయన విమర్శించారు.

నేటితో ముగియనున్న ప్రచారం
కడప జిల్లాలో పులివెందుల , ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్ధానాల ఎన్నికలను ఇటు అధికార తెలుగుదేశం, అటు ప్రతిపక్షం వైసీపీ సీరియస్ గా తీసుకున్నాయి.జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఎన్నికలు కావడంతో రాష్ట్ర వ్యాపితంగా ఈ జెడ్పీ ఎన్నికలపై చర్చ కొనసాగుతోంది.కాగా ఈరోజు (ఆదివారం) 5 గంటలకు తర్వాత పులివెందుల, ఒంటిమిట్టలో ప్రచారం ముగియనుంది. ఈ రెండు చోట్ల కూడా 11 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పులివెందుల, ఒంటిమిట్టలో 500 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉంటూ వస్తోన్న మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటన్నింటిలోనూ 12 తేదీన పోలింగ్ జరగనుంది. ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. పులివెందుల, ఒంటిమిట్టలలో జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు వుండగా ,ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న జాబితాలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మణీంద్రం, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని కారంపూడి మండలం వేపకంపల్లి, నెల్లూరు జిల్లా కావలి మండలం విడవలూరు-1 ఎంపీటీసీలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పులివెందుల జెడ్పీటీసీ స్థానంపైనే వుంది. దీనిని ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కూటమి నేతలకు సూచించారు.
Tags:    

Similar News