ఆధునిక హంగులతో అమరావతిలో మొదటి అడ్మినిస్ట్రేషన్ భవనం..రేపే ఓపెనింగ్

సోమవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఏపీ సీఆర్దీఏ భవనాన్ని ప్రారంభించనున్నారు.

Update: 2025-10-12 06:54 GMT

అమరావతిలో మొదటి పాలనా భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈనెల 13వ తేదీ సోమవారం ఉదయం 9.54 గంటలకు అమరావతిలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైన ఈ మొదటి పాలనా భవనం ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం అన్ని హెచ్‌ఓడీలను ఒకే చోట ఏర్పాటు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా సరికొత్త హంగులతో నిర్మించారు.

అమరావతికి భూములిచ్చిన రైతులకు దగ్గరగా సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం ఉండేలా ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతిని ప్రతిబింబించేలా భవనం ముందు 'A' అక్షరంతో ఎలివేషన్ రూపొందించారు. ఇకపై అమరావతి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే పర్యవేక్షణ జరుగనుంది.

అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఇక్కడ ఒక ప్రధాన భవనంతో పాటు PEB భవనాల నిర్మాణం జరిగింది.

ప్రధాన భవనం వివరాలు: మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 (G+7) భవనం అంటే 3 లక్షల 7 వేల 326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్ 0.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం 1.36 ఎకరాలు, ఓపెన్ స్పేస్ 0.96 ఎకరాలు, ఎస్టీపీ 0.39 ఎకరాల్లో నిర్మాణం చేశారు.

జీ ప్లస్ 7లో శాఖలవారీగా కేటాయింపులు:

  • గ్రౌండ్ ఫ్లోర్ - 23,814 చ.అ - రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, రెస్టారెంట్, బ్యాంక్, ఏఐ కమాండ్ సెంటర్
  • ఫస్ట్ ఫ్లోర్ - 30,886 చ.అ - కాన్ఫరెన్స్ హాల్స్
  • సెకండ్ ఫ్లోర్ - 30,886 చ.అ - సీఆర్‌డీఏ (CRDA)
  • థర్డ్ ఫ్లోర్ - 32,096 చ.అ - సీఆర్‌డీఏ
  • ఫోర్త్ ఫ్లోర్ - 30,862 చ.అ - మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీస్
  • ఐదో ఫ్లోర్ - 32,096 చ.అ - సీఆర్‌డీఏ (ADCL)
  • ఆరో ఫ్లోర్ - 32,096 చ.అ - ఏడీసీఎల్
  • ఏడో ఫ్లోర్ - 32,096 చ.అ - పురపాలక శాఖ మంత్రి చాంబర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చాంబర్, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ, ఏడీసీఎల్
  • టెర్రస్ PEB - డైనింగ్

ఇవి కాకుండా హెడ్ రూమ్స్ 5,554 చ.అ, ప్రొజెక్షన్ శ్లాబ్స్ 3,113 చ.అ, టెర్రస్ PEB స్ట్రక్చర్ 32,062 చదరపు అడుగులు కలిపి మొత్తం 2,85,561 చదరపు అడుగుల విస్తీర్ణంలో (బిల్టప్ ఏరియా) నిర్మించారు.

ఆఫీస్ ప్రాంగణంలో సంపు, పంప్ రూం 4,029 చ.అ, ఎస్టీపీ 5,014 చ.అ, డ్రైవర్స్ లాంజ్ 752, సెక్యూరిటీ రూం 225, యుటిలిటీ బ్లాక్ 11,745 చదరపు అడుగులతో కలిపి మొత్తం ఎక్స్‌టర్నల్ బ్లాక్ 21,765 చదరపు అడుగులు. ఇంటర్నల్ బ్లాక్, ఎక్స్‌టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం 3,07,326 చదరపు అడుగులతో నిర్మించారు.

మొత్తం లిఫ్ట్‌లు - 7 (ఒక్కొక్కటి 8 మంది కెపాసిటీ). పార్కింగ్ వసతి - 170 ఫోర్ వీలర్, 170 టూ వీలర్ వాహనాలు.

ఈ ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో (పార్కింగ్ ఏరియాతో కలిపి) మరో నాలుగు భవనాలు నిర్మించారు.

PEB (ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్) భవనాలు: ఒక్కొక్క భవనం 41,500 చ.అ విస్తీర్ణంలో నాలుగు భవనాలు అంటే 1,66,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనాల్లో మున్సిపల్ శాఖ హెచ్‌ఓడీలకు ఈ విధంగా కేటాయించారు. 

  • భవనం-1: 41,500 చ.అ - టిడ్కో, APUFIDC
  • భవనం-2: 41,500 చ.అ - స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రెరా అప్పిలేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్
  • భవనం-3: 41,500 చ.అ - రెరా, టౌన్ ప్లానింగ్ (DTCP)
  • భవనం-4: 41,500 చ.అ - మెప్మా కార్యాలయం

అమరావతి నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి:

అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో 79 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో సీఆర్‌డీఏ నుంచి 12,762.46 కోట్ల విలువైన 19 పనులు, ఏడీసీఎల్ నుంచి 36,737.06 కోట్ల విలువైన 60 పనులు మొత్తంగా 49,499.52 కోట్ల విలువైన 79 పనులు జరుగుతున్నాయి. మొత్తం 54,693.09 కోట్ల విలువైన 90 పనులకు పాలనాపరమైన అనుమతులు రాగా, వీటిలో 79 పనులు ప్రారంభమయ్యాయి. మరో 7 పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. మరో 5 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇవి కాకుండా మరో 36,577 కోట్ల విలువైన 20 పనులకు పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉంది అని మంత్రి నారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

Tags:    

Similar News