2029 ఎన్నికలే నా లక్ష్యం,మళ్లీ మళ్లీ వైకుంఠపాళి వద్దు-చంద్రబాబు
కేంద్రం సహకరిస్తోంది 2027 కు పోలవరం తప్పకుండా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.;
By : V V S Krishna Kumar
Update: 2025-06-29 10:36 GMT
కూటమి ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుపుదామని తెలుగుదేశం అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్థేశం చేసారు.తాను 2029 ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నానని , పార్టీ నేతలంతా ఆ దిశగానే ఆలోచన చేయాలన్నారు.పదే పదే వైకుంఠపాళి వద్దన్న చంద్రబాబు, పై నుంచి క్రిందకు పడే పరిస్థితి రావొద్దని స్పష్టంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.2014-19 మధ్య చేసిన అభివృద్దిని ప్రజలకు చెప్పుకోలేక పోయాం, సుస్థిర పాలన వుంటేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందన్నారు.
కేంద్ర సహకారం వల్లే అభివృద్ది
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ,అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు.అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని , రాజధాని పనులు పట్టాలెక్కాయని తెలిపారు.పోలవరం ప్రాజెక్టుకు కూడా 12,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది,2027 నాటి కల్లా దానిని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,400కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందని , స్టీల్ ప్లాంట్ కూడా లాభాల బాటలో పడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.రాష్ట్రానికి పెద్ద కంపెనీలు వస్తున్నాయి, రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి అభివృద్ది చేస్తున్నామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ తో 500 సేవలు అందిస్తున్నాం, ఆగస్టు 15 నాటికి 703 సేవలు ప్రజలకు వాట్సాప్ లో అందుబాటులోకి తెస్తామన్నారు.ఏళ్లు, నెలలు , రోజులు , గంటలు కూడా లెక్కకట్టుకొని పనిచేస్తున్నానని చంద్రబాబు నేతలకు చెప్పుకొచ్చారు.పాలసీల అమలులో చిత్తశుద్ది వుండాలని , ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న పని చేరాలన్నారు. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యం. భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలి” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 4 వేలకు పెంచాం,పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకుంటుంన్నా, ప్రతి రైతుకు 20 వేలు సాయం అందిస్తామని తెలిపారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మొదలవుతుందని చంద్రబాబు వెల్లడించారు.