పుష్పార్చనలతో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

ఏలూరు జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఐ.ఎస్.జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.

Update: 2025-11-24 10:38 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పౌర సరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన  పవన్ కళ్యాణ్  ఛైర్మన్  రాజబహదూర్ నివృతరావు, ఈఓ శ్రీ వి.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షణ చేసి గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ స్థల పురాణం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వ విప్ లు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మడి నాయకర్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకట రాజు, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణ, పత్సమట్ల ధర్మరాజు, పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీ కృష్ణ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఐ.ఎస్. జగన్నాథపురం పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మరమ్మతులు చేపట్టిన పొంగుటూరు - లక్కవరం రోడ్డును పరిశీలించారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ రహదారి పూర్తిగా గుంతలతో నిండి ఉంది. ప్రజల నుంచి వచ్చిన వినతి మేరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయించారు. పొంగుటూరు నుంచి లక్కవరం మధ్య 6.5 కిలోమీటర్ల రోడ్డును రూ. 1.5 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావడంతో పర్యటనలో భాగంగా రాజవరం వద్ద పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తో కలసి రోడ్డును పరిశీలించారు.
Tags:    

Similar News