వితంతువులకు పవన్ కల్యాణ్ రాఖీ చీరలు
పిఠాపురంలో 1500 మంది వితంతువులకు పవన్ కల్యాణ్ రక్షాబంధన్ కానుక చీరలు అందజేశారు.;
పిఠాపురంలో వితంతువులకు ఓ సోదరుడిగా అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సొంత నియోజక వర్గమైన పిఠాపురంలో 1500 మంది వితంతువులకు రక్షాబంధన్ చీరలు పంపిణీ చేశారు. తన తరపున మహిళలకు ఈ రాఖీ కానుకను అందజేయాలని జనసేన పార్టీ శ్రేణులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతో పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రియాశీల సభ్యులు, వీర మహిళలు రంగంలోకి దిగారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన చీరలను ఇంటింటికి వెళ్లి పవన్ కల్యాణ్ తరపున చీరలు పంపిణీ చేసి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నుంచి లాంటి రాఖీ కానుక వస్తుందని ఊహించని పిఠాపురంలోని వితంతువులు సంతోషానికి, ఆశ్చర్యానికి లోనయ్యారు. పిఠాపురం ఎమ్మెల్యేగానే కాకుండా మహిళలకు ఓ సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా పవన్ కల్యాణ్ రక్షాబంధన్ కానుకలు అందజేసినట్లు జనసేన పార్టీ కార్యాలయం నుంచి శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.