లోకేష్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి.. పెద్దలతో ర్యాపో పెంచుకుంటున్నారా?

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ , హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ భేటీ;

Update: 2025-06-18 13:20 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య,ఐటి,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో తొలిరోజు ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కర్ ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు పలువురు మంత్రులతో సమావేశ మయ్యారు.రెండోరోజు మరి కొందరు ముఖ్యులతో సమావేశం అవుతారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు కొన్ని రోజుల ముందే లోకేష్ ఢిల్లీ వెళ్లడం , పలువురు నేతలతో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఢిల్లీ పెద్దలతో సంబంధాలను మరింతగా మెరుగు పరుచుకోవడం ,వారితో వ్యక్తిగతంగా ర్యాపో పెంచుకోవడం కోసమే లోకేష్ ఇటీవల ఢిల్లీ బాట పడుతున్నారని అనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేరు, ఆయన కుమారుడిగా వున్న లోకేష్ తెలుగుదేశం పార్టీ లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కుమారుడికి ఢిల్లీ సంబంధాలను మరింతగా మెరుగుపర్చడానికే చంద్రబాబే ఆయనను ఢిల్లీ పంపుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

అమిత్ షాతో లోకేష్ భేటీ
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి చేస్తున్న విస్తృతమైన ఏర్పాట్లను వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఎపిని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది, ఎపిలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చినట్లుపేర్కొన్నారు.

 

రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి సహకరించండి
పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. చిరాగ్ పాశ్వాన్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారని, అయితే పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలకు లోకేష్ కోరారు. ఎపిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని చిరాగ్ హామీ ఇచ్చారు.. తిరుపతి ట్రిపుల్ ఐటిలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి , జులై 11, 12 తేదీల్లో రాయలసీమ పర్యటనకు వస్తున్నానని. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై అధ్యయనం చేద్దామన్నారు.యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని చిరాగ్ పాశ్వాన్ కు లోకేష్ ఈ సందర్భంగా అందించారు.

 

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో లోకేష్ భేటీ
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉపరాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ధన్కర్ వాకబు చేయగా, రూ.64వేల కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, పనులు వేగంగా పూర్తిచేస్తామని లోకేష్ చెప్పారు. ఈనెల 21వతేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమంతో చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు.ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశానికి గత 40ఏళ్లలో ఎప్పుడూ గెలవని మంగళగిరిని తాను ఎంచుకున్నానని లోకేష్ చెప్పగా, తాను కూడా తొలిసారి పరిచయం లేని నియోజకవర్గాన్నే ఎంచుకొని పోరాడానని ధన్కర్ అన్నారు. ఈ సందర్భంగా 226 రోజులపాటు 3,132 కి.మీ.ల మేర తాను చేసిన పాదయాత్రలో ఎదురైన అనుభవాలను కళ్లకుకడుతూ రూపొందించిన యువగళం పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి లోకేష్ అందజేశారు. ఈ భేటీలలో లోకేష్ వెంట ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని, పెమ్మసాని చంద్రశేఖర్, బస్తిపాటి నాగరాజు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, సానా సతీష్, శబరి పాల్గొన్నారు.

 

కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ,న్యాయశాఖామంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తోనూ లోకేష్ సమావేశమయ్యారు. గురువారం కేంద్ర కార్మిక శాఖామంత్రి మన్ సుఖ్ మాండవీయ నికలుస్తారు. దానితో పాటు ఢిల్లీ పర్యటనలో వున్న బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తోనూ లోకేష్ సమావేశం కానున్నారు.
గత నెలలోనే ప్రధాని మోదీని కలిసిన లోకేష్
ప్రధాని నరేంద్ర మోదీని కూడా మేనెలలో లోకేష్ కుటుంబసభ్యులతో సహా కలిశారు.అమరావతి కి మోదీ వచ్చిన సమయంలో ఆయన ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లిన లోకేష్ ప్రధానితో రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. ప్రధానితో కలిసి భోజనం చేసారు.భార్య బ్రాహ్మణీ, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి మోదీ ఆశ్వీరవచనం తీసుకున్నారు.
Tags:    

Similar News