జగన్ కారు డ్రైవర్ రెండో రోజు విచారణ
రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కాన్వాయ్ కేసు సంచలనంగా మారింది.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జగన్పై కేసు నమోదు కావడంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందనే ఆందోళనలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మరో వైపు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆదివారం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం కూడా విచారణ చేస్తున్నారు. ఈ కేసుపై పూర్తి స్థాయి దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఈ కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని రెండో రోజు తమ అదుపులోనే ఉంచుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసు కావడంతో రాష్ట్ర డీజీపీతో పాటు మరి కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.