తనిఖీలు చేస్తా
ఆర్టీజీఎస్, ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరు తెలుసుకునేందుకు నవంబరు నెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, తనిఖీలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతీ పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో అనే అంశాన్ని తనిఖీ చేస్తానని సీఎం అన్నారు. బుధవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రభుత్వ సేవల్లో సంతృప్త స్థాయి సహా రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని.. పాలనలో సుస్థిర విధానాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతనెల 22వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలు, లబ్ధి తదితర అంశాలపై ప్రజల నుంచి సేకరించిన ఫీడ్ బ్యాక్ వివరాలను సీఎం పరిశీలించారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. దీపావళి పండుగ తర్వాత కూడా సూపర్ జీఎస్టీ ద్వారా పన్నుల తగ్గింపు, తద్వారా ధరలు తగ్గిన అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల కలిగే లబ్ధిని స్లైడ్స్ ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని సీఎం సూచించారు.