ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి : చంద్రబాబు
ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ప్రజలు తృప్తి చెందితేనే నాకు సంతృప్తి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో టిడ్కో, గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”హౌసింగ్ ఫర్ ఆల్ అని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఈ హామీని నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 లక్షలకుపైగా ఇళ్లల్లో సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాం. ఇది ఇక్కడితో ఆగకూడదు... మరింత వేగంగా వెళ్లాలి. ఇప్పటి నుంచే లక్ష్యాలు పెట్టుకుని హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 20 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఇప్పటికే 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తై గృహప్రవేశాలు చేసుకున్నాం. ఇక మిగిలిన 17 లక్షల ఇళ్లు వచ్చే మూడేళ్లల్లో పూర్తి అవ్వాలి. ప్రతి మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టాలి. వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు జరగాలి. హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులు అందరూ బాధ్యతగా తీసుకోవాలి. త్వరలో టిడ్కో, హౌసింగ్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులందరితోనూ సమీక్ష చేస్తాను” అని తెలిపారు.