పుట్టిన రోజే ఉరి వేసుకున్నాడు
పుట్టిన రోజు కొత్త బట్టలు వేసుకుందువు లేరా అంటూ తండ్రి విలపించాడు. ఈ హృదయవిదారక దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది.
నంద్యాల జిల్లా మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువకుడు దాసరి కార్తీక్ తన పుట్టినరోజు రోజునే ఇంటి మేడపై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక, ఆరోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఈ యువకుడి మరణం గ్రామస్తులను సైం కంటతడి పెట్టించింది.
అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు కుమారుడు కార్తీక్ పదో తరగతి తర్వాత అగ్రికల్చర్ చదువుతూ మధ్యలో మానేశాడు. 2016లో తల్లి అరుణకుమారి అనివార్య కారణాలతో ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి కార్తీక్ ముభావంగా ఉండేవాడు. ఇటీవల బ్రీతింగ్ సమస్యలు తీవ్రమై మానసికంగా కుంగిపోయాడు.
మంగళవారం కార్తీక్ పుట్టినరోజు కావడంతో సోమవారం తండ్రి అతన్ని తాడిపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి, కొత్త దుస్తులు కొనిచ్చాడు. తనకు నంద్యాలలో పని ఉండటంతో వెళ్లిపోగా, కార్తీక్ పట్టణంలోని పెద్దనాన్న ఇంటికి వెళ్లి రాత్రి వరకు సరదాగా గడిపాడు. మంగళవారం పుట్టినరోజు పెద్దనాన్న ఇంట్లోనే జరుపుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పినా వినలేదు. "నానమ్మ ఒక్కతే ఉంది" అంటూ గ్రామానికి చేరుకున్నాడు. ఉదయం టిఫిన్ చేసి మేడపైకి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి రాకపోవడంతో నానమ్మ నారాయణమ్మ మేడపైకి వెళ్లి చూడగా కార్తీక్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీనిని చూసిస నానమ్మ నారాయణమ్మ గుండెలు పగిలేలా విలపించింది. స్థానికుల సాయంతో ఉరి నుంచి తప్పించినా అప్పటికే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న తండ్రి గ్రామానికి చేరుకుని కొత్త దుస్తులు చూపిస్తూ "పుట్టినరోజంటూ వేసుకుందువు లెయ్యి రా" అంటూ విలపించాడు. ఈ హృదయవిదారక దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, "నా చావుకు ఎవరూ కారణం కాదు" అంటూ రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.