ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం పెంపు వంటి కీలకమైన అంశాలను ప్రతిపాదికగా తీసుకొని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నారు. ప్రపంచం వేగంగా ముందుకు వెళుతోంది. దేశంలోనూ గణనీయమైన మార్పులు వస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని వారి శక్తిని, శ్రమను ఉపయోగించుకొని వారి జీవన ప్రమాణాలను పెంచాలి. అటవీ ఉత్పత్తులు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి ఎంతో డిమాండ్ ఉంది. కాఫీ తోటలతోపాటు అడవిలో విరివిగా దొరికే ఉత్పత్తులను సాగు చేసేలా ప్రోత్సహించాలి. మార్కెట్ డిమాండు అనుసారం అటవీ ఉత్పత్తులను విరివిగా పెంచేలా చూడాలి. నిత్యం గిరిజనులతో మమేకం కావడం, వారి ఆలోచనలను వినడం, వారికి సహాయం చేయడం మర్చిపోవద్దు. వారిలో నూతన ఉత్తేజం నింపేలా కొత్త కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు ముందుకు సాగాలి. గిరిజనుల ఆదాయం పెరగాలి. వారికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు అందాలి. విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో యువతలో స్ఫూర్తి నింపి, వారిని ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా చేయాలి. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకురావాలి అని సూచించారు.
ఉద్యాన పంటలకు ఉపాధి పనులకు అనుసంధానం
ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యాన పంటలకు అనువుగా ఉంటుంది. దీన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. దీనిపై మరింత గా దృష్టి సారించి, వివిధ రకాల పనులకు ఉపాధి హామీ అనుసంధానం అయ్యేలా అధికారులు పరిశీలన చేయాలి. ఏజెన్సీలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపుదలతో పాటు దానికి తగిన అనుసంధాన పనులు ఉపాధి పనుల్లో భాగంగా చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇది గిరిజనులకు ఉపాధి కల్పనతో పాటు గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల పెంపుదలకు ఎంతో తోడ్పాటునిస్తుంది. కాఫీ పంటలతో పాటు ఏజెన్సీలో అనువుగా ఉండే పంటలను పండించేలా కృషి చేయాలి అని పేర్కొన్నారు.
ప్రకృతిని రక్షిస్తూ పర్యాటకం పెంపుదల చేయాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకం పెంపుదల ప్రధానం. ప్రతి ఒక్కరిరీ నేడు పర్యాటకం మీద ఆసక్తి పెరుగుతోంది. ఎకో టూరిజం అనేది ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ది చెందుతున్న రంగం. దీన్ని అందింపుచ్చుకోవాలి. సహజమైన ప్రకృతి సంపదకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా ఎకో టూరిజం పెంపుదలపైన గిరిజనులకు తగిన అవగాహన కల్పించాలి. యువతకు టూరిజం వల్ల వచ్చే లాభాలు, పర్యాటకులకు వసతి కల్పించడం ద్వారా అందే ఆదాయం మీద చైతన్యం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అతి తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం సంపాదించే మార్గాలను వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది, వారి జీవన ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు చర్చిద్దాం. నిరంతర అనుశీలన చేసి, నెలవారీ రిపోర్టులతో ముందుకు సాగుదాం. సమన్వయంతో యంత్రాంగం ముందుకు సాగితే కచ్చితంగా గిరిజనుల బతుకు చిత్రాలు మారుతాయి. దీనికి అనుగుణంగా పకడ్భందీ ప్రణాళికను సిద్ధం కావాలి. దీనికి ఎల్లపుడూ ప్రభుత్వ సహకారం ఉంటుంది అని హామీ ఇచ్చారు.