ఇంగ్లీషు మీడియం పేరుతో డ్రామాలు చేశారు
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకూ అవగాహన రావాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.
By : The Federal
Update: 2025-12-08 11:55 GMT
ఇంగ్లీషు మీడియం పేరుతో డ్రామాలు చేసిందని గత వైసీపీ ప్రభుత్వంపైన, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా విద్యా వ్యవస్థలో బిల్లులన్నీ కూడా పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఏపీ జీఎస్డీపీపై ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్రస్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నాం. చేయలేమని మేం పారిపోవటం లేదు. డెవలప్మెంట్ లో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నాం. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు.
కూటమిపై ఉన్న నమ్మకం, విశ్వాసంతోనే భారీస్థాయిలో ప్రజలు మద్దతు పలికారు. ప్రజలు సుపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారు. ఆస్తులను, భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి గతంలో అప్పులు తెచ్చారు. మూలధన వ్యయం చేయకపోవటంతో గతంలో ఎక్కడా ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. కూటమి అధికారంలోకి వచ్చాకే వాటిని ముందుకు తీసుకువెళ్లగలిగాం. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టాం. సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లాం. వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకెళ్లాం. డీఫంక్ట్ అయిన వివిధ కేంద్ర పథకాలను మళ్లీ పునరుద్ధరించాం. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను మళ్లీ రివైవ్ చేయగలిగామన్నారు.
పీక్ లోడ్ సమయంలో బహిరంగ మార్కెట్ లో విద్యుత్ ను యూనిట్ కు రూ.15 చోప్పున కొనుగోలు చేసిన పరిస్థితి. గత ప్రభుత్వం పీపీఎలు రద్దు చేయడం వల్ల ఎలాంటి విద్యుత్ వాడుకోకుండా రూ.9 వేల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. కక్షపూరిత రాజకీయాలతో గత పాలకులు ప్రజాధనాన్ని నష్టం చేశారు. ఈ వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వ్యవస్థలను నిలబెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. సమర్ధవంతమైన సాగునీటి వ్యవస్థను కూడా చేపట్టాం. 950 టీఎంసీల నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉంది. ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం. క్రమంగా పెట్టుబడులు వస్తున్నాయి. రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్నాం. ఎస్ఐపీబీల ద్వారా రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఆమోదం తెలియచేశాం. విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేశారు... ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సంస్కరణలు తీసుకువచ్చామన్నారు.
గత పాలకులు విద్య శాఖలోనూ బిల్స్ పెండింగ్ పెట్టారు. పల్లెపండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోంది. జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకూ అవగాహన రావాల్సిన అవసరం ఉంది. విభజన వల్ల రాష్ట్రానికి వ్యవస్థీకృతమైన నష్టం జరిగింది. 2019-24 పాలన వల్ల వ్యవస్థలు డీఫంక్ట్ అయ్యాయి. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయింది. గత పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి రూ. 7 లక్షల కోట్ల జీఎస్డీపీ కోల్పోయాం. గ్రోత్ రేట్ లేకపోవటం వల్ల రూ. 76,195 కోట్ల ఆదాయం కోల్పోయాం. గత ప్రభుత్వంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవటం వల్ల ప్రజాధనానికి నష్టం కలుగుతోంది. రుణాల రీ-షెడ్యూలింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రాండ్ తగ్గినప్పుడు వడ్డీ రేటు పెరిగిపోతుంది. తద్వారా రెవెన్యూ జీఎస్డీపీలో రాష్ట్రం చాలా నష్టపోయింది. 25 ఏళ్ల క్రితం చేసిన ఐటీ పాలసీ వల్ల తెలుగు వాళ్ల తలసరి అదాయం గరిష్టస్థాయిలో ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే ఎప్పుడూ తన ఆలోచన అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.