వైఎస్సార్సీపీలో ఫిర్యాదులు భద్రపరిచేందుకు డిజిటల్ లైబ్రరి

వైఎస్సార్సీపీ వచ్చే వారంలో ఒక యాప్ ను విడుదల చేస్తోంది. అందులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదులు డిజిటల్ గా భద్రపరుస్తారు.;

Update: 2025-07-29 12:43 GMT
Ex Cm YS Jagan

ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. వేధింపులు

అన్నింటా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం

ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం

అందుకే ప్రశ్నించే విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం

మాజీ సీఎం వైఎస్ జగన్‌ ధ్వజం

కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమ కేసులు, అరెస్టులు వంటి అంశాలపై ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు నొక్కే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ కూటమి సర్కార్ పై ధ్వజమెత్తారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం. చంద్రబాబు చేసిన, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఇంకా ఎండగట్టడం. బాబూ ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని మిగిలిన గ్రామాల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో జగన్‌ దిశా నిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఎసీ) సమావేశం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.

ఈ మీటింగ్‌ నెలకోసారి అయినా జరిగేలా చూస్తాం. సూచనలు, సలహాల కోసం పార్టీలో సీనియర్లను పీఏసీలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలుసు. మనం ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. చూస్తుండగానే దాదాపు ఏడాదిన్నర గడిచింది. ఇంకా మనకు మిగిలింది మూడేళ్లు మాత్రమే. మనం ఇప్పుడు రాక్షస పాలన చూస్తున్నాం. దాన్ని ఇంకా ఎదుర్కోవాల్సి ఉందని జగన్ అన్నారు.

ప్రత్యేక యాప్, డిజిటల్‌ లైబ్రరీ

వచ్చే వారంలో మనం ఒక యాప్‌ విడుదల చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఎవరైనా, ఏ కార్యకర్త అయినా అధికారులతో వేధింపులకు గురైతే, లేదా ఏదైనా అన్యాయానికి గురైతే ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఫిర్యాదు చేయొచ్చు. ఎవరితో ఏ అధికారితో తాను ఇబ్బంది పడింది అన్నది చెప్పొచ్చు. దానికి సంబంధించి ఆధారాలు ఉంటే, వాటినీ అప్‌లోడ్‌ చేయొచ్చు. అవన్నీ మన డిజిటల్‌ లైబ్రరీలోని సర్వర్‌కు చేరుతాయి.

రేపు మన ప్రభుత్వం రాగానే, డిటిజల్‌ లైబ్రరీలో దాన్ని (సర్వర్‌) ఓపెన్‌ చేసి, బాధ్యులైన వారు ఎవ్వరినీ వదలకుండా చట్టం ముందు నిలబెడతాం. సినిమా చూపిస్తాం. వారు చేసినవన్నీ వడ్డీతో సహా చెల్లిస్తాం. ఈరోజు వారు నాటే విత్తనం అదే రేపు పండుతుంది. అందుకే చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పారు.


అక్రమ కేసులు, అరెస్టులు

పార్టీ సీనియర్‌ నాయకులను జైళ్లలో పెడుతున్నారు. భవిష్యత్తులో మనం ఇదే సంప్రదాయం కొనసాగిస్తే, టీడీపీ సీనియర్‌ నాయకులంతా జైళ్లలోనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మన లీడర్లను అన్యాయంగా జైళ్లలో పెట్టారు.

ఎంపీ మిధున్‌రెడ్డిని చూస్తే బాధనిపిస్తోంది. ఆయన్ను నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. అదే విధంగా మేకపాటి గౌతమ్‌రెడ్డిని కూడా నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను. వారి తండ్రులు మా నాన్న బ్యాచ్‌. వారిద్దరూ నా బ్యాచ్‌. నా ఫ్రెండ్స్‌. కేవలం వేధించడం కోసమే మిధున్‌రెడ్డిని అరెస్టు చేసి, జైల్లో పెట్టారు. ఆయన కనీసం ఇక్కడ మంత్రి కూడా కాదు. ఆయన తండ్రి రామచంద్రన్న ఎక్సైజ్‌ మంత్రి కూడా కాదు అని అన్నారు.

అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కర్మ ఏమిటంటే, అది చంద్రబాబునాయుడు నియోజకవర్గం. అక్కడ మంత్రిగా ఉండి కూడా చంద్రబాబునాయుడు ఓడిపోయాడు. 1978లో ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి గెల్చి, మంత్రిగా ఉండి కూడా పోటీ చేసి, 1983 లో ఓడిపోయాడు. ఆ తర్వాత తన మామ కాళ్లు వేళ్లూ పట్టుకుని టీడీపీలో చేరి, పోటీ చేశాడు. ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడు. చంద్రగిరిలో తన ప్రత్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాబట్టి, టార్గెట్‌ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆయన కొడుకును కూడా వేధించి అరెస్డు చేయాలని చూస్తున్నారని అన్నారు.

అలాగే నందిగం సురేష్‌, దళితుడు. ఎంపీగా ఎదిగాడు. 6 నెలల 10 రోజులు. మొత్తం 191 రోజులు జైల్లో పెట్టారు. ఒక కేసు కాగానే మరో కేసు పెట్టి జైల్లో ఉంచారు. ఇంకా కాకాణి గోవర్థన్‌రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. క్వార్జ్స్ గనుల కేసు, టోల్‌గేట్‌ కేసు, వరసగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పటికే జైల్లో పెట్టారు. ఇప్పుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ టార్గెట్‌. ఆయననూ అరెస్టు చేయాలని చూశారు. కానీ ఆ కుట్రలో భాగంగా ముందుగా అరెస్టు చేసిన వ్యక్తి (శ్రీకాంత్‌రెడ్డి) అదృష్టవశాత్తూ జడ్జీ ముందు నోరు విప్పి పోలీసులు తనను ఎలా హింసించారనేది చెప్పడంతో అనిల్‌కుమార్‌ అరెస్టు కాలేదని చెప్పారు.


వారందరి గొంతు నొక్కే ప్రయత్నం

ప్రజల తరపున మాట్లాడే వారిని, ప్రజా సమస్యలు ప్రస్తావించే వారిని ఇలా వేధించడం ఇదే మొదటిసారి. జోగి రమేష్‌ కొడుకును అరెస్టు చేయడం, రోజాను కూడా వేధించడం, ఆనందం పొందడం.. ఇంకా విడదల రజిని ని కూడా వేధించం. ఆమెమీదా కేసు పెట్టారు.

నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి దారుణం. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో విధ్వంసం చేశారు. అదృష్టవశాత్తూ అప్పుడు ఆయన ఇంట్లో లేరు. ఒకవేళ ఆయన ఇంట్లో ఉండి ఉంటే చంపే వారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. కారును కూడా పడదోశారు. దాడిపై ఆయన ఫిర్యాదు చేస్తే, పట్టించుకోని పోలీసులు.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగానే తిరిగి ఆయనపైనే చర్య తీసుకున్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ని సొంత ఇంటికి పోనివ్వడం లేదు. పైగా సీఐ గన్‌ చూపి బెదిరిస్తున్నారు.

కొందరు పోలీసుల అవినీతి పర్వం

మొదటిసారి కొందరు పోలీసులు అవినీతిలో మునిగిపోయారు. ఒక్కో జోన్‌కు డీఐజీ. ఆయన ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు. వసూళ్లు చేసి, ఎమ్మెల్యేలకు, అక్కడి నుంచి సీఎంకు, ఆయన కుమారుడికి నిధులు ఇస్తున్నారు. అలా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులకు వేలం పాటలు నిర్వహించి, ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం అమ్ముతున్నారు. వారికి పోలీసులు రక్షణగా నిలుస్తున్నారు. ఇసుక దగ్గరుండి అమ్మిస్తున్నారు. ఏ ఒక్క గని కూడా వదలడం లేదు. నేరుగా డీఐజీ డీల్‌ చేస్తున్నాడు, ఎమ్మెల్యేకు ఇంత. సీఎంకు ఇంత. ఆయన కొడుక్కి ఇంత అని ఇస్తున్నారు. ఇందులో డీఎస్పీ, సీఐలకూ వాటా వెళ్తోంది. ఇంత అవినీతి గతంలో ఎక్కడా లేదు. చూడలేదని జగన్ పేర్కొన్నారు.

హామీలు అమలు చేయలేదు

రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, అప్పులు తెచ్చి దోచుకుంటున్నారని జగన్ ఆరోపించారు. బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం బాగా కొనసాగుతోందని సమావేశంలో వెల్లడించారు.

సీనియర్లు మరింత చురుగ్గా..

సీనియర్ లీడర్లు కాబట్టి మీరు కూడా కాస్త చొరవ చూపాలి. మీరు మార్గదర్శకులుగా నిలవాలి. మీ సీనియారిటీని ఉపయోగించాలి. జిల్లా స్థాయిలో నాయకులతో మమేకం కావాలి. మన హానీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. కొందరు సీనియర్లు ఇంకా రెస్ట్‌ తీసుకుంటున్నారు. ఇప్పుడు వారంతా రంగంలోకి దిగాలి. పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలి. పార్టీల యువ నాయకులకు స్ఫూర్తిగా నిలుస్తూ, సీనియర్‌ నాయకులంతా పని చేయాలి. అలా మీ సీనియారిటీని చూపాలని నేతలకు హిత బోధ చేశారు.

పార్టీ, వ్యవస్థీకృత విధానం

రచ్చబండ కార్యక్రమం తర్వాత, గ్రామ కమిటీల ఏర్పాటు జరుగుతోంది. గతంలో మొక్కుబడిగా అవి ఏర్పాటయ్యేవి. ఇప్పుడు వాటి ఏర్పాటులో మన నాయకులు మానిటరింగ్‌ ఉండాలి. గ్రామస్థాయిలో మన కార్యకర్త ఒక వ్యవస్థీకృత విధానంలోకి రావాలి. వారికి మీరు దిశా నిర్దేశం చేయాలి. లేకపోతే, వారు ఈత కొట్టినా ముందుకు పోరు. వారు ముందుకు కదలాలంటే, గ్రామ కమిటీలను మనం మరింత వ్యవస్థీకృత విధానంలోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు.

కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం

కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్‌ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలని అన్నారు. గ్రామ కమిటీలే ఏర్పాటు కాగానే, బూత్‌ లెవెల్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. మన పార్టీ మరో 30, 40 ఏళ్లపాటు కొనసాగాలంటే, కార్యకర్తలు చాలా ముఖ్యం. మనం వారికి తోడుగా, అండగా ఉన్నామన్న విశ్వాసం కల్పించాలి. గతంలో మన ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ వల్ల, కార్యకర్తలను అంతగా పట్టించుకోలేక పోయాం. కానీ ఈసారి అలా కాదు. వారికి చాలా ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

జగన్‌ భద్రతపై ఆందోళన

ఇటీవలి పర్యటనల్లో వైఎస్ జగన్‌కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించకపోవడంపై సమావేశంలో పీఏసీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటన సందర్భంగా పోలీసులు చూపిన నిర్లక్ష్యాన్ని సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించడం లేదని తేల్చి చెప్పారు. జగన్‌గారి భద్రతపై వినిపిస్తున్న కథనాలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. వీటన్నింటి నేపథ్యంలో జగన్‌ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ పీఏసీ సభ్యులు అభిప్రాయ పడ్డారు.

Tags:    

Similar News