పంటలను వాణిజ్య కోణంలోనే చూడాలి: సీఎం చంద్రబాబు
మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై సీఎం సమీక్ష;
రాష్ట్రంలో పొగాకు, మామిడి పంటల కొనుగోలుపై నీలి నీడలు అలుముకున్నందున వాణ్యిజ్య కోణంలోనే ఆలోచించి వాటిని వ్యాపారులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పొగాకు, మామిరి, కోకో అమ్మకాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు.
మరో 20 మిలియన్ కేజీల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎంకు అధికారులు తెలిపారు. బాపట్ల -3, గుంటూరు--2, పలనాడు -1, ప్రకాశం - 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. వీటి ద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కొనుగోళ్ల కేంద్రాల వివరాలను, సంబంధిత సమాచారాన్ని ప్రతీ పొగాకు రైతుకు అందివ్వాలని సీఎం ఆదేశించారు.
పామ్ ఆయిల్ పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. పండించిన పంటకు సరైన ధర దక్కాలంటే.. ఆ పంటకు మార్కెట్టులో ఎలాంటి డిమాండ్ ఉందనే సమాచారం రైతులకు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం మామిడికి ఒక్కో కిలోకు రూ.4 చొప్పున అదనంగా మద్ధతు ధర ఇస్తున్నామని.. ప్రాసెసింగ్ యూనిట్లు రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఏడాదిలో కోకో 12 వేల మెట్రిక్ టన్నుల మేర ఉత్పత్తి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే 10 వేల మెట్రిక్ టన్నుల మేర విక్రయం కూడా జరిగినట్టు తెలిపారు. ప్రతీ రోజూ 80 నుంచి 100 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.
జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపోందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సీఎం సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.