బ్రాండ్ను సృష్టించడం అనేది కీలకం
ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
రాయలసీమలో శ్రీసిటీ, హిందుపూర్, కొప్పర్తి లాంటి చోట్ల ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తికి అనేక అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఈ ప్రాంతాలకు పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులను సూచించారు. సోమవారం సచివాలయంలో నూతనంగా రూపొందించిన ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0’ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 2025–30 ల మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా నూతన విధానంపై ముఖ్యమంత్రి చర్చించారు.
ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగుమతులు తగ్గించటం, దేశీయంగా ఉత్పత్తి పెంపు, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానానికి రూపకల్పన చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది దేశంలో 70 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులు దిగుమతి అయ్యాయని ఈ రంగంలో భారీగా డిమాండ్ ఉందని అధికారులు తెలపగా.... ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగంలో సెల్ఫ్ రిలయన్స్ , మేడ్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. అయితే అంతర్జాతీయ స్థాయి డిమాండ్ను తీర్చేందుకు వీలుగా ఏపీలో భారీస్థాయిలో ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. అదే సమయంలో ఉత్పత్తి చేసిన పరికరాలకు బ్రాండ్ను సృష్చించటం అనేది కీలకమైన అంశమని పేర్కోన్నారు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ విççస్తృత ఉత్పత్తికి ఆస్కారం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్థేశం చేశారు.
పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తికి అనువైన ఎకో సిస్టంను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆకర్షించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఈ రంగంలో బెంగుళూరు, చెన్నై లాంటి నగరాల్లో భూమి లభ్యత తీవ్రంగా ఉందని ఏపీకి ఇది సానుకూల అంశమని... రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ పరిశ్రమల్ని స్థాపించేందుకు అనుకూల ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. తిరుపతి సమీపంలోని శ్రీసిటీ, కర్నూలు సమీపంలో ఓర్వకల్లు, కొప్పర్తి, హిందూపూర్ లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రతీ ఇంటికీ ఓ పారిశ్రామిక వేత్త ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.