మొక్కలతో తీరం ముప్పునకు చెక్‌

సముద్ర తీరం కోత, గాలుల ఉధృతిని తగ్గించేందుకు ప్రయత్నం, మత్స్యకార పల్లెలకు ముప్పు నుంచి షెల్టర్‌ బెల్ట్‌తో ఉప శమనం.;

Update: 2025-06-24 12:29 GMT
విశాఖ ఉడాపర్కు వద్ద సముద్ర తీరంలో నాటిన మొక్కలు

విశాఖ సాగర తీరం సౌందర్యానికి, ఆహ్లాదానికి ప్రతిరూపం. అలాంటి తీర ప్రాంతం తరచూ కోతకు గురవుతోంది. తుఫాన్లు, వాయుగుండాల సమయంలో వీచే గాలులు, అలల ఉధృతికి తీరం కొట్టుకుపోతోంది. దీంతో అందాల ఆప్రాంతం కళా విహీనంగా మారుతోంది. అంతే కాదు... తీరంలో ఉన్న మత్స్యకార పల్లెలకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేసి తీరాన్ని, ఆపల్లెలను రక్షించటానికి ఓ ప్రయత్నం జరుగుతోంది. అందుకు స్వచ్చంద సంస్థలు, మత్స్యకార సంస్థలు ముందుకొచ్చాయి.

సముద్రతీరం వెంబడి కొన్ని రకాల మొక్కలు, చెట్లు సహజంగానే పెరుగు తుంటాయి. అవి తీరాన్ని కోతకు గురి చేయకుండా కాపాడుతుంటాయి. అలాగే ఈ చెట్లు తుపాన్లు, వాయుగుండాల ప్రభావంతో వీచే గాలులకు అడ్డుకట్ట వేస్తుంటాయి. అందువల్ల తీరానికి అనుకుని ఉండే ప్రాంతాలు, పల్లెలను ఇవి కొంతమేర రక్షిస్తుంటాయి. కానీ కాలక్రమంలో ఈ మొక్కలు, చెట్లు కనుమరుగవు తున్నాయి. దీంతో తరచూ సమ్రుద్ర ఒడ్డు కోత పాలవుతోంది. తీరప్రాంత పల్లెల్లోని ఇళ్లు దెబ్బతింటున్నాయి. రేకుల షెడ్లు, ఇళ్ల పైకప్పులు గాలుల ధాటికి ఎగిరి పోతున్నాయి. అంతేకాదు.. గాలుల ధాటికి బీచ్‌లోని ఇసుక ఒక చోట నుంచి మరో చోటకు ఎగిరిపడుతోంది. విశాఖ సాగరతీరంలో కొన్నేళ్లుగా అదే జరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఇసుక తిన్నెలలో ఉన్న కొన్ని రకాల మొక్కలు, చెట్లు అనవాళ్లు లేకుండా పోయాయి. ఫలితంగా విశాఖ నుంచి భీమిలి వరకు తీరం భారీగా కోతకు గురవుతోంది. విశాఖ బీచ్‌ కొట్టుకుపోకుండా కొన్నేళ్ల క్రితం కాపుకొచ్చిన కొబ్బరిచెట్లను పెకిలించి తెచ్చి అక్కడక్కడ నాటారు.

సంరక్షణకు ఏం చేస్తున్నారు?
2004లో సంభవించిన సునామీ ప్రభావానికి విశాఖలోని పెదజాలరిపేటకు పెద్ద నష్టమే సంభవించింది. కెరటాలు జాలరిపేటలోకి చొర్చుకు రావడంతో ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు తీరం భారీగా కోతకు గురైంది. తీరం కోత, గాలుల తీవ్రతను నియంత్రించేందుకు రేడింగ్టన్‌ ఫౌండేషన్‌ అనే సంస్థ సహకారంతో దాన్‌ ఫౌండేషన్‌ సంస్థ విశాఖ మత్స్యకార కళంజియా సమాఖ్య ద్వారా విశాఖ తీరంలోని వుడా పార్క్, జాలరిపేట వద్ద మొక్కలను నాటి సÆ రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. షెల్టర్‌ బెల్ట్‌ కింద ఇలా గత మార్చి నెలలో రావి, మర్రి, గంగరావి, సరుగుడు, బాదం తదితర జాతులకు చెందిన 1,026 మొక్కలను నాటారు. అవి బతకడానికి నాటే సమయంలో నీమ్‌ కేక్, వర్మీకంపోస్టు, ఎర్రమట్టి వంటివి వేశారు. వీటిలో చాలా మొక్కలు ఎదుగుదల దశలో ఉన్నాయి. మున్ముందు సునామీ, తుపాన్లు, వాయుగుండాలు వంటి ప్రకృతి విపత్లులు సంభవిస్తే జాలరిపేటతో పాటు ఆ పరిసర ప్రాంతాలకు ముప్పు వాటిల్లకుండా, తీరం కోతకు గురికాకుండా ఈ షెల్టర్‌ బెల్టు అడ్డుకట్ట వేస్తుంది. ఉధృతంగా వీచే గాలులను నియంత్రించి ప్రమాదాన్ని నిలువరిస్తుంది.
మున్ముందు మరిన్ని చోట్ల..
ప్రస్తుతం విశాఖలోని పెదజాలరిపేటలో పైలట్‌ ప్రాజెక్టుకు కింద ఈ షెల్టర్‌ బెల్టు ప్రోగ్రాం చేపట్టారు. త్వరలో ఈ మొక్కల చుట్టూ వెదురును కూడా నాటనున్నారు. ఈ వెదురు పొదలు కూడా సముద్రం నుంచి వీచే ఉధృతమైన గాలులను నియంత్రిస్తాయి. మున్ముందు తీరంలోని మరికొన్ని ప్రభావిత ప్రాంతాల్లోనూ తీరం కోతకు గురికాకుండా మొక్కలు నాటతామని ధ్యాన్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ వి.సాయికృష్ణ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. ఇది పైలట్‌ ప్రాజెక్టు. సత్ఫలితాలిస్తే మరికొన్ని చోట్ల దీనిని అమలు చేస్తారు.
Tags:    

Similar News