చంద్రబాబు రావడం..మీటింగ్ పెట్టడం

ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోందని, సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించామని తెలిపారు.

Update: 2025-11-06 12:07 GMT

సీఎం చంద్రబాబు లండన్ పర్యటన నుంచి వచ్చీ రాగానే సమావేశం నిర్వహించారు.  గురువారం సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్లు హాజరయ్యారు. అలాగే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్‌లు పాల్గొన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలు, టెక్నాలజీ వాడకం, పౌరుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. పాలనను మరింత సమర్థవంతంగా చేయడానికి డేటా వాడకం కీలకమన్నారు.  దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని అధికారులకు సూచించారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా విజన్ ప్రణాళికలను రూపొందించామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని సూచించారు. అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్‌ను టెక్నాలజీ వాడకంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని, రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని గుర్తు చేశారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని అధికారులు గుర్తించాలని కోరారు.

క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. సీఎఫ్‌ఎం‌ఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని, గత ప్రభుత్వ చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నానని, నెలలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం పౌరసేవలు అందించాలని, ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామని ప్రకటించారు. ఆర్‌టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామని, దానికి అనుగుణంగా నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోందని, సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించామని తెలిపారు. పౌరుల సేవల్లో మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్థుల డేటా అనుసంధానం కావాలని, అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని, ఈ డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే అనలటిక్స్ చేసి తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉందని వివరించారు. ప్రిడిక్టివ్ అనలటిక్స్‌కు కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతోందని, ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నామని, నిధులు వ్యయం సమర్థంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయని, ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రశ్న అని ప్రస్తావించారు.

పాత విధానాల్లో మార్పు అవసరమని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేదని, ఈ పరిస్థితి అంతా మారిపోవాలని, కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్‌ను సమర్థంగా వినియోగించాలని సూచించారు. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలని కోరారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయని, శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటి ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాలని, ఓఎస్‌ఓపీ ఉన్నా దానిని ఎందుకు పాటించలేకపోతున్నామని ప్రశ్నించారు. పీపుల్స్ పాజిటివ్ పర్సెప్షన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గత పాలకుల హయాంలో ఎక్సైజ్ లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని, వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ మనపై బ్లేమ్ గేమ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. పారదర్శకత పాటించటంతో పాటు దానిని ప్రజలకు కూడా సరిగ్గా చెప్పుకోవాలని, పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలు కూడా డేటా లేక్‌కు అనుసంధానం కావాలని ఆదేశించారు. 

Tags:    

Similar News