నన్ను రాజ్యసభకు ఎంపిక చేయడమే బీజేపీ గొప్పతనం
బీజేపీ వెనుకబడిన తరగతుల వారికి ప్రాధాన్యత ఇస్తుందననేందుకు నా ఎంపిక నిదర్శనమని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పాకా వెంకట సత్యనారాయణ అన్నారు.;
బీజేపీలో వెనుకబడిన తరగతుల వారికి ప్రాధాన్యత, పార్టీ కోసం పని చేసే వారికి గుర్తింపు వస్తుందనేందుకు తనను రాజ్యసభకు ఎంపిక చేయడమే నిదర్శనమని ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. రాజ్యసభకు నామినేషన్ వేసిన అనంతరం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నేతలు అందరూ తన పేరును ఎంపిక చేసి పార్టీ అధిష్టానానికి పంపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నామీద పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తానని అన్నారు. ఏపీలో బీజేపీ బలోపేతం చేస్తూ కూటమి లక్ష్యాలను ముందుకు తీసుకెళతానన్నారు.
అన్ని వర్గాల వారినితో సంబంధాలు మెరుగు పరుచుకునే విధంగా పనిచేస్తానని చెప్పారు. కూటమితో కలిసి పని చేస్తామని, దేశం హితం, రాష్ట్రం అభివృద్ధి కోసం కలిసి అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలో జరిగే అభివృద్ధిలో తనకు భాగస్వామ్యం కలగడం ఆనందంగా ఉందన్నారు. మోదీ, అమిత్ షా, నడ్డాలతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. వివాదాస్పద చట్టాలు పక్కన పెట్టి మోదీ తీసుకునే నిర్ణయాలు ఆదర్శంగా ఉన్నాయని పాకా వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు.