ఏవియేషన్ యూనివర్సిటీ.. మరో మణిహారం!
ఏపీకి త్వరలో పౌర విమానయాన యూనిర్సిటీ రాబోతోంది.;
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-06-12 14:50 GMT
భోగాపురం ఎయిర్పోర్టు వద్ద ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
అది కార్యరూపం దాలిస్తే అక్కడే పైలట్ శిక్షణకు అవకాశం లభిస్తుంది.
ఉత్తరాంధ్రలో మరో ప్రతిష్టాత్మక యూనివర్సిటీకి మార్గం సుగమం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ (పౌర విమానయాన విశ్వవిద్యాలయం) ఏర్పాటుకు తొలి అడుగు పడుతోంది. విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలోనే ఈ ప్రఖ్యాత విమానయాన విశ్వవిద్యాలయం అనువుగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కేంద్రానికి ప్రతిపాదించింది. ఇందుకవసరమైన భూమితో పాటు వనరులు కూడా ఉన్నాయని నివేదించింది. ఈ యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర సిగలో మరో మణిహారమే అవుతుంది.
దేశంలో సివిల్ ఏవియేషన్కు సంబంధించిన కాలేజీలు 375 వరకు ఉన్నాయి. వీటిలో 343 ప్రైవేటు సంస్థలు నడుపుతుండగా, మిగిలినవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే ఏవియేషన్ యూనివర్సిటీలు మాత్రం పరిమిత సంఖ్యలోనే (రాజీవ్గాంధీ ఏరోనాటికల్ యూనివర్సిటీ, అమేథీ), జామియా మిలియా యూనివర్సిటీ (న్యూ ఢిల్లీ), సిల్వర్ ఓక్ యూనివర్సిటీ (బెంగళూరు) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, డెహ్రాడూన్)లు వంటివి ఉన్నాయి. ఇంకా మరికొన్ని యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఏరోనాటికల్కు సంబంధించిన కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీలు ఏరోనాటికల్ విద్యపై ఆసక్తి ఉన్న వారి ఆశయాలను తీరుస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో పైలట్ ట్రైనింగ్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఏవియేషన్ మేనేజిమెంట్ల్లో పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సులను ఇవి ఆఫర్ చేస్తున్నాయి. ఈ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు/సంస్థలు విమానయాన రంగంలో ఎందరో నిపుణులను, పైలెట్లను, ఎయిర్ హోస్టెస్లను, తయారు చేస్తున్నాయి. భోగాపురం వద్ద ప్రతిపాదిత సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలో ఏఏ కోర్సులను ప్రవేశపెడతారు? ఆయా కోర్సులకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? నిధులు ఎంత అవసరం? ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారు? వంటి వాటిపై స్పష్టత రావడానికి ఇంకా సమయం పడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన వాటిలో ఈ కోర్సులకు అనుబంధంగా టీచింగ్ ఎయిర్క్రాఫ్ట్, మెయింటెనెన్స్ రిపైర్స్ ఓవరాల్ (ఎంఆర్వో), సిమ్యులేటర్ పైలట్, క్రూ ట్రైనింగ్ ఇన్ఫ్రా వంటివి ఉన్నాయి. సిమ్యులేటర్ పైలట్ అంటే ఒక స్థిరమైన చోట ఎయిర్క్రాఫ్ట్ను ఏర్పాటు చేసి అందులో పైలట్కు ప్రాథమికంగా అవసరమైన శిక్షణ ఇస్తారు.
భోగాపురం వద్ద ఏవియేషన్ యూనివర్సిటీ..!
విశాఖపట్నానికి సుమారు 50 కి.మీల దూరంలో విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణంలో ఉంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ విమానాశ్రయం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్టు కోసం గతంలో సేకరించిన భూమిలో మరో 500 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు అందులోని కొంత స్థలంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కూడా భాగస్వామిగా ఉంది. టీడీపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం వద్ద ఈ సివిల్ ఏయివేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించడం లాంఛనప్రాయమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓ. నరేష్కుమార్
ఏడాదిలో కార్యరూపం దాల్చాలి..
‘భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం హర్షణీయం. అక్కడ ఏవియేషన్ విశ్వవిద్యాలయం ఏర్పాటును కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ (అపాటా) తరఫున ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడులకు లేఖ రాశాం. తాజాగా ఇప్పుడు ఆ యూనివర్సిటీ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినందుకు వారిద్దరికీ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. విద్యార్థులు ఒకపక్క కోర్సులను అభ్యసిస్తూ, మరోపక్క ఎయిర్క్రాఫ్ట్స్ ఇంజినీరింగ్ మెయింటెనెన్స్, మెళకువలను నేర్చుకునే వీలుంటుంది. ఇంకా డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ల నిర్వహణకు అక్కడే అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏడాదిలోగా ఈ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని కోరుతున్నాం’ అని ‘అపాటా’ వైస్ ప్రెసిడెంట్ ఓ నరేష్కుమార్ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.