ప్రతి జిల్లాలో ఆక్వా రైతు సదస్సులు
ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, ఫిషరీష్ శాఖ మత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు.;
ఆక్వా రంగంలో రైతులు, సీడ్, ఫీడ్ వ్యాపారులు, ఎక్స్ పోర్టర్స్ ఈ నాలుగు రంగాలు అతి కీలకమని ఈ సంక్షోభ సమయంలో నాలుగు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ఆక్వారంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకారం, మార్కెటింగ్, పశుసంరక్షణ, డెయిరీ డెవలప్ మెంట్, ఫిషరీస్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అమెరికా దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో రైతులు, ఆక్వారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కేవలం విదేశీ ఎగుమతులపైనే ఆధారపడకుండా, స్వదేశీ వినియోగం పెంచేలా పౌల్ట్రీలో నెక్ తరహాలో ఆక్వా రంగంలోనూ రొయ్య ఉత్పత్తుదారులతో ఓ కమిటీ వేసేందుకు ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
అమెరికా సుంకాల కారణంగా తీవ్ర భయాందోళనలు చెందుతున్న ఆక్వా రైతులు, ఎగుమతిదారులు ప్రస్తుత పరిణామాలకు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇతర మార్గాల ద్వారా ఆక్వా రంగం కోలుకునే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా అధినేత ట్రంప్ సుంకాలపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితులను నిశితంగా సమీక్షిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు, ఎక్కువ మంది ఆధారపడిన ఈ రంగానికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంలో మత్స్య రంగం కీలకభూమిక పోషిస్తోందని అన్నారు.
మన దేశం నుంచి అమెరికా వెళ్లే సముద్ర ఆహార ఎగుమతులపై 26 శాతం దిగుమతి సుంకం అమెరికా ప్రభుత్వం విధించడం కలవరపాటుకు గురిచేస్తోందని అన్నారు. ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచేందుకు వీలుగా ఇప్పటికే విద్యుత్తు సబ్సిడీ ప్రకటించిందని, ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 పైసలకే అందించనున్నట్లు తెలిపారు. ఆక్వా రైతులు ప్రభుత్వం ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందాలన్నా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే నిబంధన విధించిందని తెలిపారు. జోన్ నాన్ జోన్ అనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్ లు చేయనున్నట్లు వివరించారు. దాణా ధర తగ్గింపు విషయంలోనూ తయారీదారులతో చర్చిస్తున్నామన్నారు.
అమెరికా విధించిన సుంకాల ఉపద్రవాన్ని అవకాశంగా మలచుకుని ఎవరికీ ఎలాంటి నష్టం లేకుండా పరస్పర సహకారంతో ముందుకు వెళ్తామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణ రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యానికి రొయ్యల వల్ల కలిగే మేలు గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు ప్రతి ఒక్కరూ రొయ్యల వినియోగం పెంచేలా చేస్తే ఎగుమతులపై ఆధారపడాల్సిన అవసరం రాదన్నారు. రొయ్యలు తీసుకోవడం వల్ల గుడ్ కొలస్ట్రాల్ శరీరంలో చేరుతుందని, తద్వారా ఆరోగ్యంకు మేలు జరుగుతుందన్నారు. ఆర్మీ మెనులో సైతం రొయ్యని చేర్చే విషయమై కేంద్ర మంత్రిని కలిసి చర్చిస్తామన్నారు. రొయ్య సాగుదారులు తీవ్ర మనోవేదనతో ఉన్నారని, వైరస్ వంటి ఇబ్బందులు మరింత పెరగకుండా రొయ్యలు కొనుగోలు జరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలోని ఎగుమతిదారులు, ఇతర రాష్ట్రాల అసోయేషన్ ప్రతినిధులతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు.
మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ మాట్లాడుతూ క్రైసిస్ ను ఆపర్చునిటీగా మార్చుకున్నప్పుడే జీవితంలో ఉన్నతంగా రాణించగలమని, అలాగే అమెరికా విధించిన సుంకాల విధింపు అనే క్రైసిస్ ను తట్టుకుని నిలబడటానికి దేశీయ వినియోగం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా విధించిన సుంకం ఒక్క ఆక్వా రంగంపైనే కాదని, అన్ని ఎగుమతులకు వర్తిస్తుందని తెలిపారు.
ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు, ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ రాజు, కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, జీఎఫ్ఎస్టీ డైరక్టర్ సి కుటుంబరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామారాజు, మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, ఆక్వా ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు, రైతులు తదితులు పాల్గొన్నారు.