ఏపీ టీచర్స్‌ ఎమ్మెల్సీ బై ఎలక్షన్‌..ప్రశాంతంగా పోలింగ్‌

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.;

By :  Admin
Update: 2024-12-05 06:58 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పీడీఎఫ్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ జిల్లాల పరిధిలోని ఓటర్లుగా ఉన్నా ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 113 మండలాల్లో 116 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెవిన్యూ, మునిసిపల్, పంచాయతీరాజ్‌ శాఖల భవనాల్లో వీటిని ఏర్పాటు చేశారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో అదనంగా మరొక పోలింగ్‌ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. కాకినాడ, రాజమండ్రి, అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం వంటి చోట్ల అదనంగా మరొక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. ప్రధానంగా ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. బొర్రా గోపిమూర్తి(భీమవరం), గంధం నారాయణరావు(ద్రాక్షారామం), నామన వెంకటలక్ష్మి(సామర్లకోట), కవల నాగేశ్వరరావు(రాజమండ్రి), పులుగు దీపక్‌(తాడేపల్లిగూడెం) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

బ్యాలెట్‌ విధానంలో పోలింగ్‌ చేపట్టారు. గంధం నారాయణరావుకి 1, దీపక్‌ పులుకు 2, డాక్టర్‌ కవల నాగేశ్వరరావుకు 3, నామన వెంకటలక్ష్మి(విళ్ల లక్ష్మి)కి 4, బొర్రా గోపీమూర్తికి 5వ సంఖ్యను కేటాయించారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలోని 92వ పోలింగ్‌ స్టేషన్‌లో అత్యధికంగా 896 ఓటర్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం పరిధిలోని డొంకరాయి ఏడో నంబరు పోలింగ్‌ స్టేషన్‌లో అత్యల్పంగా ముగ్గురు ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు 16,737 మంది ఉన్నారు. కాకినాడ జిల్లాలో 3418, తూర్పు గోదావరి జిల్లాలో 2990, బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో 3296, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 637, పశ్చిమ గోదావరి జిల్లాలో 3729, ఏలూరు జిల్లాలో 2667 మంది ఓటర్లు ఉన్నారు.
Tags:    

Similar News