ఏపీ లిక్కర్ స్కామ్–ఆస్తుల అటాచ్మెంట్కు ఆమోదం
ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఆస్తులను జప్తుకు సంబంధి తక్షణమే తదుపరి చర్యలు చేపట్టాలని ఉత్తర్వల్లో ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (AP లిక్కర్ స్కామ్)లో పెద్ద ఎత్తున ఆస్తుల అటాచ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (నవంబర్ 19, 2025) అధికారికంగా ఆమోదం తెలిపింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ఉత్తర్వుల్లో కీలక అంశాలు
సిట్ సమర్పించిన నివేదిక, విన్నపం ఆధారంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందిన రూ.63.72 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తులు మద్యం కుంభకోణం నుంచి వచ్చిన కమిషన్లు, కిక్బ్యాక్లతో సంపాదించినవని, అవినీతి నిరోధక చట్టం (Prevention of Corruption Act) , క్రిమినల్ లా సెక్షన్ల కింద జప్తు చేయదగినవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎవరి పేర్లపై ఆస్తులు అటాచ్ అవుతున్నాయి?
ఉత్తర్వుల ప్రకారం కింది వ్యక్తులు, సంస్థల పేరిట ఉన్న ఆస్తులు అటాచ్ అవుతాయి.
- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
- కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి (సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్)
- భార్య చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి (కేవీఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ)
రూ.54.87 కోట్ల బ్లాక్ మనీని తెల్లగా మార్చారు
సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను కేవలం రూ.8.85 కోట్లుగా చూపించగా, నిజమైన మార్కెట్ విలువ రూ.63.72 కోట్లకు పైగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ విధంగా రూ.54.87 కోట్లకు పైగా నల్లధనాన్ని ఉద్దేశపూర్వకంగా దాచి, తెల్లధనంగా మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అరబిందో ఫార్మా భూమి మోసం కూడా గుర్తింపు
వెండోడులోని అరబిందో ఫార్మాకు చెందిన 263.28 ఎకరాల భూమి కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా కొనుగోలు, అమ్మకంలో జరిగిన మోసాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ లావాదేవీ ద్వారానే రూ.13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
కోర్టు దరఖాస్తుకు అనుమతి
విజయవాడలోని అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టులో ఆస్తుల అటాచ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిట్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డీజీపీకి తక్షణమే తదుపరి చర్యలు చేపట్టాలని ఉత్తర్వల్లో ఆదేశించారు.
ఇదే తొలిసారి పెద్ద ఎత్తున అటాచ్మెంట్ ఆమోదం
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకు ఒకే కుటుంబానికి చెందిన రూ.60 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం ఇదే తొలిసారి. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.