కారు కింద కార్యకర్త పడినా జగన్‌ గుర్తించకపోవడం దారుణం

మాజీ సీఎం జగన్‌పై హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు.;

Update: 2025-06-23 15:47 GMT

కారు కింద కార్యకర్త పడినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్‌ మాటలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని, విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. సోమవారం ఆమె సచివాలయంలో మాట్లాడుతూ వైసీపీ మీద, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా పొదిలి జగన్‌ పర్యటనలో వైసీపీ నాయకుల అరాచకాలను ప్రజలందరూ చూశారని, 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో జగన్‌కు తెలియదా? అంటూ ప్రశ్నించారు. మహిళల మీద వైసీపీ నాయకులు రాళ్లు విసరడం, వారిని గాయపరచడం, విధుల్లో ఉన్న పోలీసులనుసైతం గాయపరచడం ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు.

పరామర్శల పేరుతో వెళ్లి రెంటపాళ్లలో రోడ్‌షో నిర్వహించి సింగయ్య మృతికి జగన్‌ కారకుడయ్యారని ధ్వజమెత్తారు. జగన్‌ కారు కింద పడి గాయపడిన వ్యక్తిని దయ, జాలి లేకుండా వైసీపీ నాయకులు పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేసి వెళ్లి పోయారని మండిపడ్డారు. గాయపడిన సింగయ్యను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండిఉండే ప్రాణాలతో బతికేవారేమో అని అనిత పేర్కొన్నారు. జగన్‌కు కానీ, వైసీపీ నేతలకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని మండిపడ్డారు. ఇద్దరు వ్యక్తులు మరణించినా తన పర్యటనను కొనసాగించారని జగన్‌పై ధ్వజమెత్తారు. రెంటపాళ్లలో బెట్టింగ్‌లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత పరామర్శిస్తారా? అంటూ జగన్‌పై అనిత ప్రశ్నల వర్షం కురిపించారు.
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసులు జగన్‌ను, వైసీపీ నేతలను హెచ్చరించారని, అయినా వాటిని పెడచెవిన పెట్టి మరీ జగన్‌ పర్యటన చేసి ఇద్దరు వ్యక్తుల మరణాలకు కారకులయ్యారని మండిపడ్డారు. పరామర్శకు కాకుండా తన బలప్రదర్శన చేసేందుకే జగన్‌ తన పర్యటన చేసినట్లుందని విమర్శించారు. జగన్‌ అనే వ్యక్తి రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడని, అలాంటి జగన్‌కు రాజకీయాల్లో స్థానం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నాటి ప్రతిపక్ష నేతలను రోడ్డుపైకి రానిచ్చారా? అంటూ జగన్‌ను నిలదీశారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని, అలా కాకుండా హింసను ప్రేరేపించే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఎంత వరకు న్యాయమని నిలదీశారు. 


Tags:    

Similar News