తుని రైలు దగ్దం కేసు అప్పీల్.. జడిసి వెనకడుగు వేసిన చంద్రబాబు

ఇరకాటంలో ఏపీ ప్రభుత్వం.. అప్పీల్ వెళ్ల రాదని నిర్ణయం;

Update: 2025-06-03 16:09 GMT


తుని రైలు దగ్ధం కేసును తిరడదోడాలన్న నిర్ణయం  నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వెనకడుగు వేసింది. జిల్లా కోర్టు కొట్టి వేసిన ఈ  కేసును రీఒపెన్ చేసేందుకు హైకోర్టులో అప్పీలు వేయాలన్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాపులు మండిపడ్డారు.  దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులను పునర్విచారణ చేయాలన్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇంత సున్నితమైన అంశంలో తిరిగి విచారణ కు ఆదేశాలు ఎవరు ఇచ్చారు. విషయం బయటకు వచ్చే వరకు ప్రభుత్వ పెద్దలకు తెలవకుండా ఎలా వుందనే అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

కాపుల ఉద్యమం నేపధ్యంలో తునిలో జరిగిన రైలు దగ్దం కేసును వైసీపీ హయాంలోనే రైల్వే కోర్టు కొట్టివేసింది. కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం(ముద్రగడ పద్మనాభ రెడ్డి) ప్రధాన నిందితుడిగా వున్నారు. జగన్ హయాంలో నే ఈ కేసుకు సంబంధించి కాపు నేతలందరిపై పెట్టిన కేసులను ఉపసంహరించారు. ఈ నేపధ్యంలో తుని కేసును తిరగదోడటమంటే ముద్రగడనే కాదు మొత్తం కాపు నేతలందరినీ ఇరుకున పెట్టినట్లే అవుతుంది. అంటే కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భావిస్తున్న జనసేన, దాని అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఇలాంటి కీలకమైన ,సున్నితమైన అంశంలో కేసు పునర్ విచారణ కూటమి ప్రభుత్వం లోనే ప్రకంపనలు సృష్టిస్తుంది.

వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

తుని రైలు దగ్దం కేసులో రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకూడదని ప్రభుత్వం నిశ్చయించింది. కేసును మళ్లీ తిరగదోడే ఉద్దేశం తమకు ఎంతమాత్రం లేదని సర్కార్ తేల్చిచెప్పింది.ఈ కేసులో హైకోర్టులో అప్పీల్ చేయాలంటూ జారీ అయిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.

ఆర్‌పీజీ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగానే అప్పీల్ కోసం ఉత్తర్వులు వెలువడినట్లు ప్రభుత్వం గుర్తించింది.

అంతేకాకుండా, ఏ స్థాయిలో, ఎవరి ఆమోదంతో ఈ అప్పీల్ ఫైల్ ముందుకు నడిచిందనే విషయంపై సమగ్రంగా ఆరా తీయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . ప్రభుత్వానికే పెను మచ్చగా మారే ఇలాంటి విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన వచ్చినట్లు, అప్పీల్‌కు వెళ్లాలన్న పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ అధికారికంగా జీవో త్వరలోనే వెలువడనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రగిలిపోయిన కాపు వర్గం

చంద్రబాబు ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై కాపు సామాజికవర్గం భగ్గుమంటోంది. తమను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపులకు దిగడంపై యావత్‌ కాపు సామాజికవర్గం మండిపడుతోంది. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నరీతిలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తమను కూరలో కరివేపాకులా తీసిపారేయడం మాత్రమే కాదు.. ఏకంగా అక్రమ కేసులు పెట్టి వేధించే కుట్రకు తెగబడటంపై ఆ సామాజికవర్గంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఎప్పుడో సమసిపోయిందనుకున్న కేసు తిరగదోడి కాపులను తిరిగి ఇబ్బందుల పాల్జేయాలనే కుట్రలను తిప్పికొడతామని కాపు నేతలు, కాపు సామాజికవర్గం వారు హెచ్చరించారు. కుట్రపూరితంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను సహించబోమని, వాటికి వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైసీపీ కాపు నేతలు ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పై పోరుకు వైసీపీ కి మరో అస్త్రం లభించినట్లయ్యింది.

Tags:    

Similar News