TIRUMALA || తిరుమలలో శ్రీవారికి బంగారు కవచాన్ని తొలగించే అరుదైన ఘట్టం.. !
ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జరుగనుంది.;
తిరుమల లో ఏటా జ్యేష్ఠ మాసంలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నిత్య కల్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో మలయప్పస్వామికి ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా మూడురోజులపాటు జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. దీనిని అభిద్యేయక అభిషేకం అని కూడా అంటారు.
తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఏటా మూడు రోజులపాటు జరిగే జ్యేష్ఠాభిషేకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి తరతరాలుగా ఎన్నో రకాల అభిషేకాదులతో అలరారే శ్రీవారి, దేవతా ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షణ చేసే ఉత్తమమైన ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం.
మొదటిరోజు శ్రీ మలయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచం అలంకరిస్తారు. రెండవరోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. మూడవరోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునః సమర్పిస్తారు
మూడు రోజులపాటు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించిన తరువాత చివరిరోజు ఉభయ దేవేరులతో కలసి శ్రీమలయప్పస్వామివారు బంగారు కవచంలో దర్శనమిచ్చి భక్తులను అలరిస్తారు. జ్యేష్ఠాభిషేకం చివరిరోజు సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.
సాధారణంగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజునే వస్తుంది. జ్యేష్టా నక్షత్రంతో ముగిసే జ్యేష్ఠాభిషేకం రోజు రాత్రి పౌర్ణమి ఘడియలు ఉంటే ఆ రోజు శ్రీవారి పున్నమి గరుడ సేవ కూడా కమనీయంగా జరుగుతుంది. ఈ గరుడ సేవ చూసిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం.
జ్యేష్ఠాభిషేకం ముగిసిన తర్వాత స్వామికి, ఉభయ దేవేరులకు అలంకరించే బంగారు కవచం వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు అంటే ఈ సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంలోనే భక్తులకు దర్శనమిస్తారు.
తిరుమల శ్రీవారి మూల విగ్రహాన్ని, ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని జ్యేష్ఠాభిషేకం జరిగే మూడు రోజులలో దర్శించుకుంటే ఇహ లోకంలో సకల సౌఖ్యాలు పొంది పరంలో వైకుంఠాన్ని చేరుకుంటారని శాస్త్రవచనం.