సమ్మిట్‌కు 72 దేశాల నుంచి 552 మంది డెలిగేట్లు!

వైజాగ్‌లో ప్రారంభమైన సీఐఐ 30వ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు అంచనాకు మించి విదేశీ డెలిగేట్లు హాజరయ్యారు.

Update: 2025-11-14 10:52 GMT
డ్రోన్‌ సిటీకి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 30వ సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు అంచనాకు మించి విదేశీ డెలిగేట్లు హాజరయ్యారు. ఈ సదస్సుకు తొలుత 40 దేశాల నుంచి 300 మంది వరకు డెలిగేట్లు వస్తారని అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా ఈ సమ్మిట్‌కు 72 దేశాల నుంచి 552 మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే చెప్పారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు జరుగుతున్న పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ను శనివారం ఉదయం 9.15 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రారంభించారు. సదస్సుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు దేశ విదేశాలకు చెందిన మంత్రులు, రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, ఐటీ సహా వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు వెరసి 2,500 మంది వరకు వచ్చారు. 72 దేశాల నుంచి 522 అంతర్జాతీయ డెలిగేట్లు, 600 జాతీయ బిజినెస్‌ లీడర్లు, 1,600 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వెరసి 2,500 ప్రతినిధులు హాజరైనట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది హాజరు కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.


సదస్సు ప్రధాన వేదికపై ఉపరాష్ట్రపతి, చంద్రబాబు, పీయూష్‌ గోయల్, గవర్నర్‌ తదితరులు

ఏడు అంశాలపై సదస్సు..

మొత్తంగా ఏడు అంశాలపై రెండు రోజుల భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. ట్రేడ్, ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండస్ట్రియలైజేషన్, సస్టెయినబిలిటీ అండ్‌ క్లైమేట్‌ యాక్షన్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్, గ్రోత్, జియో ఎకనమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఇంక్లూజన్‌ వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారు. ఏపీ పెవిలియన్‌ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు. సీఐఐ చైర్మన్‌ రాజీవ్, యూసఫ్‌ ఆలీ, అమిత్‌ కల్యాణి, కిరణ్‌ అదానీ, సుదర్శన్‌ వేణు, కామినేని శోభన, సంజీవ్‌ బజాజ్, జీఎం రావు, సుచిత్ర కె. ఎల్లా తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. మరోవైపు వివిధ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా నిర్వహించే వరుస భేటీల్లో రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత ప్రతినిధులకు వివరిస్తున్నారు. తొలిరోజు శనివారం ఈ సదస్సు వేదికగానే వివిధ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

సీఎం చంద్రబాబు వర్చువల్‌ ప్రారంభాలు..

సీఎం చంద్రబాబు డ్రోన్‌ సిటీ, స్పేస్‌ సిటీలను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జపాన్‌ రాయబారి ఓనో కెలిచీతో ఆయన భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఏఐ ఫర్‌ వికసిత్‌ భారత్‌ సమావేశంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఏఐ ఇంటిలిజెన్స్‌ ఏపీ ఆర్థికాభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఇది ముగిశాక సింగపూర్‌ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు.

రెండ్రోజులు.. 45 సెషన్లు..

సీఐఐ సమ్మిట్‌ జరిగే ఈ రెండు రోజులు 45 సెషన్లు నిర్వహిస్తారు. తొలిరోజు సుమారు 25 సెషన్లలో వివిధ అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ఈ సెషన్లలో చంద్రబాబు, లోకేష్‌లు పాల్గొన్నారు. సుమారు రూ. పది లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 410 ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. సదస్సు ప్రారంభానికి ముందు రోజే (గురువారం) రూ.3.65 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి 35 సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. శుక్రవారం కూడా పెద్ద సంఖ్యలోనే ఎంవోయూలు జరగనున్నాయి. అందుకు తగిన సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేశారు.

వైజాగ్‌కు సీఎం కొత్త నిర్వచనం..

వైజాగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త నిర్వచనం చెప్పారు.  భాగస్వామ్య సదస్సుకు వస్తున్న అతిథులకు ఆహ్వానం పలుకుతూ ‘ఎక్స్‌’లో ఆయన ఈ విధంగా ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News