22ఏ జాబితా దరఖాస్తులు సత్వర పరిష్కారం

రెవెన్యూ శాఖలో సంస్కరణలు వేగవంతం.

Update: 2025-12-09 12:21 GMT

రాష్ట్రంలో భూమి సంబంధిత వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ జాబితా నుంచి భూముల వివరాలు తొలగించాలని వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. 22ఏ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, డాక్యుమెంట్ల ట్యాంపరింగ్‌ను నివారించేందుకు బ్లాక్‌ చెయిన్ వంటి పటిష్ట వ్యవస్థలను అమలు చేయాలని సూచించారు. భూమి వివరాలన్నింటినీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచితే వివాదాలు తలెత్తవని పేర్కొన్నారు.

సచివాలయంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేయాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలు సహా అన్ని సేవల్లో రియల్ టైమ్ ఆటో మ్యుటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, భూ యజమానులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని సూచించారు. రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలని, దీనిపై ప్రతీ నెలా సమీక్షిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు.


రియల్ టైమ్ గవర్నెన్స్ లో అధికారులతో సమీక్షిస్తున్న సీఎం

పీజీఆర్ఎస్‌లో మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి 1,97,915 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ల్యాండ్ నేచర్, క్లాసిఫికేషన్ సంబంధిత వివాదాలపై 1,00,835 దరఖాస్తులు, రీసర్వే అనంతరం భూమి తగ్గిందని 1,00,295 ఫిర్యాదులు, జాయింట్ ఎల్‌పీఎంలపై 2,40,479 ఫిర్యాదులు నమోదైనట్టు వివరించారు. ప్రస్తుతం 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా, మిగిలిన 10,123 గ్రామాల్లో 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతీ నెలా రీసర్వే పురోగతిపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. జాయింట్ లాండ్ పార్సెల్ మ్యాప్స్ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, భూమి వివరాలు ఆన్‌లైన్ డేటాబేస్‌లో ఉంచితే ఈసీ జారీ సులభమవుతుందని పేర్కొన్నారు.

చుక్కల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని, 1999 వరకు ప్రాథమిక సహకార సంఘాల వద్ద తాకట్టు పెట్టిన అసైన్డ్ భూములను కూడా తొలగించాలని సీఎం చెప్పారు. బంజరు భూములు 1954 కంటే ముందు సేల్ డీడ్స్ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్‌ను 22ఏ నుంచి తొలగించాలని సూచించారు. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ పరిష్కార అధికారాన్ని ఇకపై ఆర్డీవోలకు ఇవ్వాలని నిర్దేశించారు.

మున్సిపల్ పరిధిలోని అసైన్డ్ భూములు 250 చదరపు గజాల లోపు స్థలాలను 50 శాతం బేస్ వాల్యూతో రెగ్యులరైజ్ చేయాలని, ఆక్వా కల్చర్ చేస్తున్న అసైన్డ్ భూములను సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రం వెంటనే ఇవ్వాలని, ఆర్టీజీఎస్‌తో అనుసంధానించి ఆదాయ ధృవపత్రాలు జారీ చేయాలని సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రూ.10,169 కోట్ల రెవెన్యూ లక్ష్యాన్ని పెట్టుకున్నామని, మార్కెట్ విలువలతో భూమి విలువలను అప్‌గ్రేడ్ చేయాలని తెలిపారు.

గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు రెవెన్యూ శాఖకు 5,28,217 గ్రీవెన్సులు వచ్చాయని, వాటిలో 4,55,189 (86 శాతం) పరిష్కారమయ్యాయని అధికారులు వివరించారు. మరో 73 వేల గ్రీవెన్సులు పరిశీలనలో ఉన్నాయని, అసంతృప్తి ఫిర్యాదులను తిరిగి ఓపెన్ చేస్తున్నామని తెలిపారు. జూన్ 2024 నుంచి 22ఏ జాబితా నుంచి తొలగించాలని 6,846 దరఖాస్తులు వచ్చాయని, ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములకు మాత్రమే తొలగింపు అనుమతి ఇస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

Tags:    

Similar News