గోదావరి-బనకచర్ల : రాయలసీమను మభ్యపరచడంలో పరాకాష్ట
సిఎంల హామీలు కోటలు దాటుతున్నా, సాగునీటి బడ్జెట్ కేటాయింపులలో రాయలసీమ పట్ల వివక్ష కొనసాగుతూనే ఉందంటున్నారు ఈ ప్రాంత రైతు నాయకుడు బొజ్జా దశరథరామిరెడ్డి;
-బొజ్జా దశరథ రామిరెడ్డి
తప్పుడు నిర్ణయాలతో విషమించిన పరిస్థితులను కూడా తమ అవకాశాల కోసం మలుచుకోవడంలో దిట్టలైన పాలకుల ఆలోచనల ప్రతిరూపమే “గోదావరి బనకచర్ల” (Godavari-Banakacharla) అనుసంధానం.
పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలు … రైతు దేశానికి వెన్నెముక … రైతే రాజు … లాంటి ఊత పదాల తుంపర్లు రాజకీయ నాయకుల నోటి నుండి నిత్యం జాలివారుతున్నా. రైతుల పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. అదేవిధంగా వెనకబడిన రాయలసీమ (Rayalaseema)లో ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు లాంటి ఊత పదాల తుంపర్లతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన 1953 నాటి నుండి రాయలసీమ తడిసి ముద్దయిపోతున్నా రాయలసీమ సాగునీటి రంగం ఏ దుస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే.
రాజకీయ నాయకుల హామీలు కోటలు దాటుతున్నా, సాగునీటి ప్రాజెక్టుల బడ్జెట్ కేటాయింపులలో రాయలసీమ పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ వివక్షత వలన అసంపూర్తి సాగునీటి నిర్మాణాలు, నిర్వహణ లోపంతో కుంటుపడిన సాగునీటి ప్రాజెక్టులు రాయలసీమలో అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల వలన తుంగభద్ర, కృష్ణమ్మ రాయలసీమ ముంగిట గలగల ప్రవహిస్తున్నా, రాయలసీమ దాహార్తిని తీర్చకుండానే, దిగుకు ప్రవహిస్తూ సముద్రం పాలవుతున్నాయి. ఈ నీటిని వినియోగించుకోవడానికి చేపట్టిన అనేక నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి. నిర్మాణం జరిగిన ప్రాజెక్టులలో భాగంగా ఉన్న అనేక రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీస్, మైనర్లు నిర్వహణ లోపం వల్ల రూపురేఖలు కూడా లేకుండా పోయాయి. ఈ మౌలికమైన నిర్మాణాలను గాడిలో పెట్టకుండా రాయలసీమలో తాగునీరు, సాగునీరు అందించే పరిస్థితి లేదు.
రాయలసీమ సాగునీటి రంగ అభివృద్ధికి రాయలసీమలో మౌలిక నిర్మాణాలు, నిర్వహణ ఆవశ్యకతపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనుల శాఖకు స్పష్టమైన అవగాహన ఉంది. జలవనరుల శాఖ నుండి ఈ అంశాలపై ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు పంపిస్తున్నా, రాష్ట్రం విడిపోయిన 11 సంవత్సరాల నుండి పాలకులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే వస్తున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన గేట్ల నిర్వహణకు అవసరమైన గ్రీజు మొదలు, ఎనిమిది సంవత్సరాలుగా తెగిపోయిన అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులు, రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరునగరి, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కేటాయింపు, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం తదితర అంశాల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా పాలకులు నిర్వహిస్తున్నారు.
బొజ్జా దశరథరామిరెడ్డి
హక్కుగా ఉన్న తుంగభద్ర కృష్ణా జలాలను వినియోగించుకోలేక సముద్రంపాలు చేస్తున్న వైనం 75 శాతం సంవత్సరాలలో కొనసాగుతూనే ఉంది. మే 31, 2025 కు ముగిసిన వర్ష సంవత్సరంలో 90 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరిపడే కృష్ణా జలాలను సముద్రపాలు చేసాము. కానీ రాయలసీమలో త్రాగునీరు, సాగునీరు అందించలేకపోయాం. ప్రపంచ వారసత్వ సాగునీటి సంపదగా గుర్తింపబడిన కేసీ కెనాల్ కు చివరి దశలో ఒక్క తడి నీరు ఇవ్వలేక వేలాది ఎకరాలలో పంటలు ఎండిపోయిన పరిస్థితిని ఈ సంవత్సరం చూశాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాయలసీమలోని అనేక ప్రాజెక్టులలో ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమ సాగునీటి రంగాన్ని గాడిలో పెట్టడానికి అవసరమైన బడ్జెట్ నిధులను కేటాయించకుండా, గోదావరి బనకచర్ల అనుసంధానం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అనే కొత్త పల్లవిని పాలకులు ఎత్తుకున్నారు.
ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల (10 సంవత్సరాలు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కొనసాగించకుండా ఆగమేఘాల మీద అమరావతికి తరలించడం, కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టవలసిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నెత్తికెత్తుకోవడం తదితర చర్యలు) దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాయలసీమలో సాగునీటి రంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక, మభ్యపరిచే దిశలో “గోదావరి బనకచర్ల” అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టిందని రాయలసీమ సమాజం భావిస్తుంది.
పాలకులు తప్పుడు నిర్ణయాల వల్ల జరిగిన పొరపాట్లలను కూడా అమరావతి, పోలవరం నిర్మాణాల రూపంలో అవకాశాలుగా మార్చుకొని తమ రాజకీయ ఆర్థిక లబ్ధి కోసం వినియోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగానే రాయలసీమ మౌలిక నిర్మాణాల కోసం పైసా ఖర్చు పెట్టలేని ప్రభుత్వం, “గోదావరి బరకచర్ల” ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి పేరుతో కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు మేలు చేయడం, తమ ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని మరింత సుస్తిరిపరచుకోవడం కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అవకాశంగా మలుచుకుంటుందని కూడా రాయలసీమ సమాజం భావిస్తుంది.
పాలకులు ముందుగా అత్యంత ప్రాధాన్యతతో రాయలసీమలో పొంగిపొర్లుతున్న తుంగభద్ర, కృష్ణా, పెన్నా నదుల జలాల సంరక్షణ చేపట్టాల్సి ఉంది. రాయలసీమ హక్కుగా ఉన్న ఈ జలాలను వినియోగించడానికి చేపట్టాల్సిన నిర్మాణాల, నిర్వహణల పట్ల పాలకులు ప్రత్యేక శ్రద్ధను పెట్టాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా గోదావరి జలాలను నాగార్జునసాగర్ కు మళ్ళించి శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా రాయలసీమ అవసరాలకు వినియోగించాల్సి ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలు అందించాల్సిన అవసరం ఉంది. గోదావరి జలాలను బనకచర్లకు మళ్ళించడం అనే మభ్యపరిచే ప్రాజెక్టుకు బదులుగా గోదావరి జలాలను నాగార్జునసాగర్ ఆయకట్టుకు అనుసంధానం చేసే కార్యక్రమాన్ని (రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టైల్ పాండ్ ప్రాజెక్టు కు బదులుగా) ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది.
పాలకులు తాము చేసిన తప్పులను కూడా అవకాశంగా మరల్చుకొని తమ ఆర్థిక, రాజకీయ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకొనే దిశగానే చూడడం కొంతనైనా మాని, రాయలసీమ భవిష్యత్తుపై దృష్టిలో ఉంచుకొని రాయలసీమ సాగునీటి మౌలిక నిర్మాణాల పట్ల శ్రద్ధ వహించాలని రాయలసీమ సమాజం ఆశిస్తున్నది.
(బొజ్జా దశరథ రామిరెడ్డి, అధ్యక్షులు, రాయలసీమ సాగునీటి సాధనా సమితి, నంద్యాల)