శంకర్ లీగల్ వార్నింగ్.. 'దేవర' కా లేక ‘కంగువ’కా ??

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమలను భారీ డైలమాలో పడేసారు. ఆయన తాజాగా ఇచ్చిన లీగల్ వార్నింగ్ రెండు పెద్ద సినిమాలను వేలెత్తి చూపెడుతోంది.

Update: 2024-09-23 05:51 GMT

స్టార్ డైరెక్టర్ శంకర్ ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమలను భారీ డైలమాలో పడేసారు. ఆయన తాజాగా ఇచ్చిన లీగల్ వార్నింగ్ రెండు పెద్ద సినిమాలను వేలెత్తి చూపెడుతోంది. తాను కొన్న నవలలోని సీన్స్ ని మీరు చెప్పా పెట్టకుండా కాపీ కొట్టేసి మీ సినిమాలో వాడేశారు. మీరు ఈ పనులు మానుకోకపోతే కోర్టుకు వెళ్లాల్సివస్తుందన్న రీతిలో ఘాటుగా సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ వార్నింగ్‌లో ఆయన ఏ సినిమాని ఉద్దేశించి అనేది క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు రెండు సినిమాలపై అందరి దృష్టి పడింది. అది ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'దేవర' కా లేక సూర్య హీరోగా రూపొందుతున్న ‘కంగువ’కా అనేది అర్థం కాలేదు. దాంతో ఇది పెద్ద డిస్కషన్‌గా సోషల్ మీడియాలో మారింది. అయితే వీటిలో ఏ సినిమా అయ్యే అవకాశం ఉంది.

విషయం ఏమిటంటే నిన్న అంటే ఆదివారం రోజు సాయంత్రం శంకర్ ఒక ట్వీట్ చేశారు. అందులో ‘‘వెంకటేశన్‌ రాసిన ఐకానిక్‌ తమిళ నవల ‘నవ యుగ నాయగన్‌ వేళ్‌ పారి’ కాపీరైట్స్‌ నావే. నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో వినియోగించడం చూసి షాకయ్యా. నవలలోని ముఖ్యమైన సీన్‌ను.. ఓ లేటెస్ట్‌ మూవీ ట్రైలర్‌లో చూసి కలత చెందా. నవలలోని సీన్స్‌ను సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మరే ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనైనా వినియోగించడం మానుకోండి. క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్‌ను ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. ఏ సినిమా ట్రైలర్‌లో నవల ఆధారిత సన్నివేశం ఉందో శంకర్‌ వెల్లడించలేదు.

ఆయన ప్రస్తావించిన తమిళ నవల యుగ న్యాయ వేల్ పారి కథకు దగ్గరగా దేవర సినిమా ఉంటుందనే డిస్కషన్ మొదలైంది. అందులోనూ దేవర ట్రైలర్ నిన్న సాయింత్రమే రిలీజైంది. దాంతో ట్రైలర్ చూసే ఈ పోస్ట్ పెట్టారన్నారు. దానికి తోడు ఇప్పటికే కొరటాల శివ శ్రీమంతుడు సినిమా విషయంలో ఇలాంటి కాపీ వివాదం ఎదుర్కొన్నారు. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

అయితే కొంతమంది మాత్రం అది దేవర అయి ఉండకపోవచ్చు అని అంటున్నారు. అది సూర్య హీరోగా రూపొందుతున్న కంగువ అయ్యి ఉంటుంది అంటున్నారు. సూర్య హీరోగా శివ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కంగువా. ఈ మూవీ టైటిల్‌తో పాటు సూర్య గెటప్ అనౌన్స్ అయిన దగ్గరి నుంచి ఎప్పుడూ టాక్ ఆఫ్ ద టౌన్‌గానే ఉంటోంది. వైవిధ్యమైన కథతో పాటు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ మూవీగా రూపొందుతోన్న ఈ మూవీలో సూర్య ట్రైలర్ లీడర్‌గా కనిపించనున్నారు. అతని నేపథ్యం కోసం ‘నవ యుగ నాయగన్‌ వేళ్‌ పారి’సీన్స్ లేపి ఉంటారంటున్నారు. అయితే ఈ చిత్రం ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. కేవలం టీజర్ మాత్రమే బయటకు వచ్చింది.




 

దర్శకుడు శంకర్ చెప్పిన దాని ప్రకారం ‘వెల్ పారి’ ఓ చారిత్రక తమిళ నవల. కోవిడ్ టైమ్ లో తాను ఆ నవలను చదివానని,తనకు తెగ నచ్చేసిందని శంకర్ చెప్పారు. ఆ తర్వాత ఆ నవల రైట్స్ తీసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నానని అన్నారు. స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చిందని, మూడు పార్ట్ లుగా ఈ సినిమా రూపొందించాలని చెప్పుకొచ్చారు.

ఇక తమిళ ఎపిక్‌‌గా నవల ‘వెల్పరి’ఇప్పటికే తమిళనాట భారీగా సక్సెస్ అయ్యింది. సు.వెంకటేశన్‌ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. ఈ నవల తమిళ చరిత్ర ఆధారంగా రాయబడ్డది. తమిళ ఆనంద వికటన్ పత్రికలో ఈ నవల 100 వారాలు పాటు వచ్చింది. సీరియల్ గా వచ్చేటప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. 2019 లో పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకం కోసం రచయిత చాలా ప్రాంతాలు తిరిగి రీసెర్చ్ చేశారు.

నవల కథాంశం ఏమిటి

ఈ నవల ముఖ్యంగా ఓ గిరిజన రాజు చుట్టూ తిరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. పరంబునాడు ప్రాంతాన్ని వేల్‌ పారి పాలించేవాడు. అది ఒక కొండ ప్రాంతాలతో కూడిన రాజ్యం, 300 గ్రామాలు చుట్టూ ఉండేవి. చాలా అందమైన ప్రకృతికే ఈ ప్రాంతానికి ప్రాణం. సంగం యుగంలో ఈ కథ జరుగుతుంది. ఆ సమయంలో చేర, చోళ , పాండ్య రాజవంశాలు తమిళ ప్రాంతాన్ని పాలించాయి. వాళ్లు ముగ్గురూ కత్తి గట్టి ‘వెల్పరి’రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి దాడి చేస్తారు. ఆ యుద్ధం చాలా కాలం పాటు సాగింది. అది ఎలా జరిగింది. ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేశారు. చిన్న రాజు అంత పెద్ద మూడు రాజ్యాల వారిని ఎదిరించి ఎలా నిలబడ్డాడు అనేది అసలు కథ.

దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించాల్సిన ఈ సినిమాని కరణ్‌ జోహార్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా, పెన్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ప్రపోజల్ పెట్టారని, వారు ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఈ సినిమాలో హీరోగా ఎవరు చేయాలి, ఎవరితో ముందుకు వెళ్లాలనేది శంకర్ ఆలోచనగా చెప్తున్నారు.

అలాగే ఈ సినిమా కోసం వేర్వేరు హీరోలను శంకర్ పరిశీలిస్తున్నారట. ‘కేజీయఫ్‌ 1, 2’ చిత్రాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించిన యశ్‌ అయితే బాగుంటాడని ఆయన అనుకున్నారట. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ఆ చిత్రాలతో యశ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఆయనతోను నామ మాత్రంగా చెప్పారని, ప్రపోజల్ పెట్టారని వినికిడి. ఈ నేపథ్యంలో ఈ లోగా ఈ నవలలోని కొన్ని కీలకమైన సీన్స్ తెరపై ఆల్రెడీ తెరపై వచ్చేస్తే తను నవల రైట్స్ కొనుక్కుని మాత్రం ఏం చేసుకోగలను అనేది శంకర్ సమస్య. అలాగని ఫలానా సినిమా అని చెప్పడం లేదు. ఎవరైతే నవలలో సీన్స్ లేపారో వాళ్లకే తన ట్వీట్ తగలుతుందని ఆయనకు బాగా తెలుసు. వాళ్లు సినిమాలో ఆ తరహా సీన్స్ తీసేస్తారని నమ్ముతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుండగా సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.

Tags:    

Similar News