బెగ్గర్ వర్సెస్ బిలియనీర్

కుబేరా కుంటినడక ... కథనంలో బిగువు లేదు;

Update: 2025-06-21 09:38 GMT

అందమూ,నటనా ....రష్మిక మిలమిలా మెరిసిపోయింది. బిచ్చగాడుగా ధనుష్ గుండెల్ని మెలిపెట్టే అభినయం. షోకు, అదో క్లాసు....సినిమాకి నిండుదనం తెచ్చాడు నాగార్జున. విలనూ గడగడలాడించాడు. దేవిశ్రీప్రసాదూ మెప్పించాడు. శేఖర్ కమ్ములకేం తక్కువా! దుమ్ము రేపేశాడు. ఇంత మజా వున్నప్పుడు సినిమా పూర్తయ్యాక మనకి నీరసం ఎందుకు వస్తుంది?ఈ మూడుగంటల మంచి సినిమాని ఒక పెద్ద లోపం చాచి కొట్టింది. నిరుపేదలూ,మరీ ముఖ్యంగా బిచ్చగాళ్ళ పక్షాన స్థిరంగా, ధైర్యంగా నిలబడి, వేలకోట్ల కార్పొరేట్ల కుతంత్రాలను విప్పి చెప్పిన ఒక సదాశయం ఎక్కడో దారి తప్పింది. దర్శకుడికి ఎంత తెగువ వున్నా కథని బిగువుగా నడపడంలో మునుపటి చాకచక్యం కానరాలేదు.

ఒక సోషల్ క్లాస్ వైరుధ్యాన్ని తెర మీదకి తెచ్చాడు శేఖర్. పరమ దరిద్రులూ, యాచకులు, బిచ్చగాళ్ళు అనే వాళ్ళు మనుషులే!వాళ్ళకీ కలలూ కన్నీళ్ళు వుంటాయి. అలాంటి వాళ్ళకి చదువు,తిండి,ఆరోగ్యం,ఇళ్ళు –మనందరి బాధ్యత. కుబేర ఇచ్చే సందేశం ఇదే. హైలీ ఎమోషనల్ అప్పీల్. కదిలిస్తుంది. కట్టిపడేస్తుంది. కోటానుకోట్ల ప్రైవేట్ కంపెనీతో రాజకీయ నాయకులు చేతులు కలుపుతారు. కుట్ర చేస్తారు. లక్ష కోట్లు చేతులు మారాలి. సగం నలుపు. సగం తెలుపు. అంత పెద్ద మొత్తం మారడానికి దొంగదారులున్నాయి. ఉత్తుత్తి కంపెనీలు పెట్టి, బ్యాంక్ ఖాతాలు తెరిచి, వ్యవహారం చక్కబెట్టాలి. చేయని నేరానికి జైల్లో వున్నసి.బి.ఐ అధికారి నాగార్జునని విడిపించి,లక్ష కోట్ల పని అప్పజెపుతారు. నలుగురు బిచ్చగాళ్ళని సెలక్ట్ చేసి, వాళ్ళని షోగ్గా తయారు చేసి, కంపెనీ బాస్ లుగా రంగంలోకి దింపుతారు. కోటిశ్వరుల పనికి వొప్పుకున్న నాగార్జున అతితెలివి యిదంతా.

తిరుపతిలో గుడిమెట్ల మీద అడుక్కునే అక్షరం ముక్కరాని భిక్షకుడు మన ధనుష్. నలుగురు యాచకుల పేర్ల మీద వేల కోట్లు మారాలి. అదే డ్రామా. అది సినిమాకి కీలకం. ఎవడినో ప్రేమించి మోసపోయిన రష్మిక,బిచ్చగాడు ధనుష్ విచిత్రంగా కలుస్తారు. వేలకోట్లు ధనుష్ అకౌంట్లో వుంటాయి. అతనికా విషయం తెలీదు. కోటిశ్వరుల దురాశ, నాగార్జున నిజాయితీ, రష్మిక ఒంటరితనం, ధనుష్ దయాగుణం ....వీటన్నిటినీ కలిపి సమర్థంగా, ప్రతిభావంతంగా నడిపిస్తున్న వేళ, టెంపో తగ్గి విసుగు పుట్టిస్తుంది.

డ్యూయెట్లు లేవు. ఐటెం సాంగ్ లేదు. ఒక సామాజిక దుర్మార్గం మీదే ఫోకస్ చేసి తీసిన అరుదైన సినిమా అని కుబేరని పొగడవచ్చు. ఈ హృదయం లేని సమాజంలో బిచ్చగాళ్ళుగా బతుకుతున్న సాటి మనుషులపై గొప్ప కన్సర్న్ తో తీసిన సినిమా అయినా,ఇది పాన్ ఇండియా ఫిల్మ్. అనగా, అయిదారొందల కోట్ల,వీలైతే వెయ్యి కోట్ల లాభాల కోసం పన్నిన పంచరంగుల వల. అందుకే పచ్చి ఫార్ములా ఎండింగ్ తో సినిమా చివరిసీను సెంటిమెంటల్ డంప్ యార్డ్ గా మిగిలిపోయింది.

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ గుర్తుందా? డ్రామా,సెంటిమెంటూ అద్భుతంగా పండాయి ఆ సినిమాలో.

కమర్షియల్ స్కీం పరిధిలోనే, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి తీసిన ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి’ అనే పాన్ ఇండియన్ బుల్ షిట్ తీశాడు. ఆనంద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తీసిన శేఖర్ కమ్ముల కుబేరని ఉదాత్తంగా ప్రెజెంట్ చేయబోయి తడబడ్డాడు. కుబేర మొదటి గంటా 20 నిమిషాలు స్టన్నింగా ఉంది. డంప్ యార్డ్ లో బిచ్చగాడి శవదహనం కన్నీళ్ళు పెట్టిస్తుంది. మనిషి,మానవత్వం గురించిన తాత్విక వేదన, మాటలూ ఎప్పటికీ గుర్తుంటాయి. సెకండ్ హాఫ్ లో కథని అన్ ఫోల్డ్ చేయడంలో స్పీడు తగ్గి,నిడివి పెరిగి,నీరసం ఆవహిస్తుంది. కొంత చప్పబడి, పలచబడి, తడబడి విసుగనిపిస్తుంది. అక్కడే ఒక సూపర్ బ్లాక్ బస్టర్ కి ఆమడ దూరంలో ఆగిపోయింది కుబేర!

సీరియస్ నెస్ దెబ్బతినకూదదన్న శేఖర్ ఆత్రుతలో ఎంటర్ టైన్ మెంట్ అనే కమర్షియల్ ఎలిమెంట్ లేకుండా పోయింది. రష్మిక అంత స్టార్ వున్నా, డాన్స్ లేకుండా నిగ్రహించుకోవడం గొప్ప విశేషమే.

నా సొంత అభిప్రాయం. కుబేరకి అస్సలు ధనుష్, రష్మిక,నాగార్జునల అవసరం లేనే లేదు. బిచ్చగాళ్ళు వర్సెస్ అమానుషమైన సమాజం అనే సబ్జెక్ట్ గనక మూడు,నాలుగు కోట్లతో చిన్న సినిమాగా శేఖర్ కమ్ముల తీసి వుంటే, కుబేర నిజంగా బ్లాక్ బస్టర్ అయి వుండేదా? అనే అనిపిస్తోంది!

అభిప్రాయం 2: ఇదే కుబేరని ఒక పెద్ద హీరోతో పూరి జగన్నాథ్ గానీ, సుకుమార్ గానీ తీస్తే ఎలా వుండేది? పాన్ ఇండియా లెవల్లో ఇంకా బాగా వర్కవుట్ అయ్యేదేమో! 

Tags:    

Similar News