ఒలింపిక్స్ చిహ్నం అర్థమేంటో తెలుసా? ఐదు రంగులు ఎందుకో తెలుసా?

ఒలింపిక్స్.. తెలియని వారుండరు. కానీ ఒలింపిక్స్ గుర్తును అలానే ఎందుకు.. ఎవరు.. ఎప్పుడు డిజైన్ చేశారో? తెలుసా. అందులో ఐదు రింగులే ఎందుకు ఉంటాయో తెలుసా..

Update: 2024-07-29 11:46 GMT

ఒలిపింక్స్.. ప్రతి క్రీడాకారుడు అడుగు పెట్టాలనుకునే వేదిక. ఈ వేదికపై విశేష ప్రతిభను కనబరిచి పతకాన్ని సాధించి తన దేశం గర్వపడేలా చేయాలని కలలు కంటాడు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో శ్రమిస్తాడు. అదే విధంగా ఈ ఒలిపింక్స్ పోటీలను నిర్వహించడానికి ప్రపంచ దేశాలో పోటీ పడుతుంటాయి. మన భారత్ కూడా ఎన్నోసార్ల ఒలింపిక్స్ నిర్వహించాలని ప్రయత్నించినా వీలుకాలేదు. ఒలింపిక్స్ నిర్వహించడానికి కావాల్సిన వసతులు భారత్‌లో లేవని.. భారత్‌కు ఒలిపింక్స్ నిర్వహణ బాధ్యతలను ఇప్పటివరకు అప్పగించలేదు. భవిష్యత్తులో ఇదేమైనా మారుతుందేమో తెలియదు. అయితే ఒలింపిక్స్ చిహ్నం చాలా విచిత్రంగా ఉంటుంది. ఏవో ఐదు రింగులు ఒకదానికొకటి పెనవేసుకున్నట్లు కనిపిస్తాయి. దానికి తోడూ ప్రతి రింగ్ కూడా వేరే రంగులో ఉంటుంది. ప్రపంచ దేశాలు ఎంతో విశేషంగా చూసే ఈ ఒలిపింక్స్ చిహ్నం వెనక అర్థం, చరిత్ర ఏంటో తెలుసా? అసలు ఆ రింగులు అన్నీ ఒకే రంగులో కాకుండా ఐదు వేరువేరు రంగుల్లో ఎందుకు ఉన్నాయో తెలుసా? రండి తెలుసుకుందాం..

ఒలింపిక్స్ క్రీడలు ఇప్పటివి కావు. క్రీస్తు పూర్వం కూడా ఈ క్రీడా పోటీలకు విశేష ఆదరణ ఉండేది. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో అనేక సామ్రాజ్యాలుగా విడిపోయి ఉన్న ప్రాచీన గ్రీకులో నిత్యం యుద్ధాలు జరుగుతుండేవి. వాటిని తగ్గించడానికి, సామ్రాజ్యల మధ్య సామరస్యను తీసుకురావడానికి క్రీడలు సహాపడతాయని గ్రహించి క్రీ.పూ.776లో మొదటిసారిగా క్రీడా పోటీలను నిర్వహించారు. ఆ తర్వాత ఇవి రోమన్ చక్రవర్తి థియోడొసియస్ కారణంగా మరుగున పడిపోయాయి. ఏడీ 393లో పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఫ్రాన్స్‌కు చెందిన క్రీడా పండితుడు పియరీ డీ కోబర్టీన్.. ఒలింపిక్స్‌కు తిరిగి ప్రాణం పోశాడు. అందుకే ఈయనను ఫాదర్ ఆఫ్ ఒలింపిక్స్‌గా పిలుస్తారు. 1892లో ఈయన ఒలింపిక్స్‌ను పునరుద్దరించాలని ప్రకటించారు. ఆయన ప్రకటన మేరకు 1896లో తొలి పునఃప్రారంభించబడిన ఒలింపిక్స్ జరిగాయి. వీటినే ఆధునిక ఒలింపిక్స్ అని చెప్తారు.

 

1896లో జరిగిన తొలి ఆధునిక ఒలింపిక్స్‌కు ఎథెన్స్ వేదికగా నిలిచింది. ప్రాచీన ఒలింపిక్స్ ఆఖరి సారిగా జరిగింది కూడా ఎథెన్స్‌‌లనే కావడం గమనార్హం. ఎక్కడైతే ఒలింపిక్స్ ఆగిపోయాయో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభం కావడం ఒలింపిక్స్ మరింత ప్రఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 1913లో ప్రస్తుతం మనం చూస్తున్న ఐదు రింగుల గుర్తును ఒలింపిక్స్ గుర్తుగా గుర్తించడం జరిగింది. దీనిని రూపొందించిన వ్యక్తి కూడా పియరీ డీ కొబర్టీనే. ఈ గుర్తు తొలిసారి 1913లో పియరీ రాసిన ఓ లేఖ పైభాగంలో కనిపించింది. ఈ గుర్తును ఆయనే తన స్వహస్తాలతో గీసి, రంగులు కూడా వేశాడు.

వీటికి అర్థం కూడా ఆయన అప్పుడే చెప్పారు. ఈ ఐదు రింగులు ప్రపంచంలోని ఐదు భాగాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని వెల్లడించారు. ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో 1914లో ఈ చిహ్నానికి ఆమోద ముద్ర వేశారు. ఈ చిహ్నంలో ఐదు రింగులు ఉండగా వాటిలో మూడు పైన ఉంటే రెండు మాత్రం కింద ఉంటాయి. ఈ ఐదు రింగులు ఐదు ఖండాలను ఉద్దేశించి గీయబడ్డాయి. దేశాలన్నీ కలిసి మెలిసి ఉండాలని చెప్పడమే ఈ ఐదు రింగులు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉండటానికి సంకేతం. ఈ చిహ్నాన్ని 1920లో తొలిసారి అధికారిక ఒలింపిక్స్‌కు చిహ్నంగా వినియోగించారు.

అయితే ఈ ఐదు రంగుల్లో ఏ రంగు.. ఏ ఖండానికి చిహ్నం అన్నది విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ప్రతి దేశ జెండా కూడా ఈ ఐదు రంగుల్లోని రంగులలో కచ్ఛితంగా ఒక్కదానినైనా కలిగి ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే ఈ ఐదు రంగులను పెట్టినట్లు కొందరు చెప్తుంటారు.

Tags:    

Similar News