ఉత్తమ శ్రేణి సంపాదకుడు ముట్నూరి

నందిరాజు రాధాకృష్ణ: తెలుగు పత్రికలకూ, సంపాదకులకూ ఒక ఒరవడిని, కొత్త గౌరవాన్ని ఆపాదించిన మహానుభావుల్లో ఆద్యులనతగ్గవారు ముట్నూరి కృష్ణారావు పంతులు.

By :  Admin
Update: 2024-06-25 02:00 GMT

 -నందిరాజు రాధాకృష్ణ

తెలుగు పత్రికలకూ, సంపాదకులకూ ఒక ఒరవడిని, కొత్త గౌరవాన్ని ఆపాదించిన మహానుభావుల్లో ఆద్యులనతగ్గవారు ముట్నూరి కృష్ణారావు పంతులు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ‘కృష్ణా పత్రిక’ సంపాదకుడిగా పని చేసిన కృష్ణారావు తెలుగునాట ఆదర్శప్రాయుడయిన సంపాదకుడిగా - నాటికీ నేటికీ - నిలిచి ఉన్నారు. ఉత్తమ శ్రేణికి చెందిన సంపాదకులలో ముట్నూరి కృష్ణారావు ఒక మణి కిరీటం. వేదాంతం, దేశభక్తి, సాహిత్యం త్రివేణి సంగమంగా ఆయన సంపాదకీయాలలో ఉరకలెత్తుతూ తెలుగువారిని అలరించేవి. "కృష్ణాపత్రిక" సంపాదకునిగా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రముఖ పాత్రికేయులు. తెలుగు, ఇంగ్లీష్, సంస్కృత సాహిత్యాలతో ప్రగాఢ పరిచయం కలిగిన కృష్ణారావు శక్తిమంతమయిన రాజకీయ వ్యాఖ్యాతగానే కాక, తూకం తెలిసిన కళాభిజ్ఞుడిగా కూడా సుప్రసిద్ధులు.

ఇరవయ్యో శతాబ్ది మొదట్లో ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య మొదలుపెట్టిన ‘కృష్ణాపత్రిక’ ఉపసంపాదకుడిగా చేరిన కృష్ణారావుకు ఆంధ్ర పత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి కృష్ణాపత్రిక నుండి తమ పత్రికకు ఆకర్షించారు. మరోవైపు పట్టాభి సీతారామయ్య కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతం కృష్ణాపత్రిక లోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశారు. నాలుగయిదేళ్లలోనే ఆ పత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కూపర్ వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవారు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. 38 సంవత్సరాల సంపాదక జీవితంలో ఆయన ఎన్నెన్నో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.

ముట్నూరి కృష్ణారావు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరులో జన్మించారు. పుట్టగానే తల్లి గతించారు, బాల్యంలోనే తండ్రి పరమపదించడం వల్ల పినతండ్రి ప్రాపకంలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం బందరు హిందూ ఉన్నత పాఠశాలలో,. తర్వాత బందరు నోబుల్ కళాశాలలో ఎఫ్.ఏ అభ్యసించారు. ఇక్కడే ఈయన రఘుపతి వెంకటరత్నం నాయుడుకు శిష్యుడయ్యే అవకాశం కలిగింది. వెంకటరత్నం నాయుడు సంఘసంస్కరణ శీలన, మూఢాచార నిర్మూలన వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి బ్రహ్మసమాజంలో ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్థిగా తీర్చిదిద్దడమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించారు.

కృష్ణారావు మద్రాసులో ఎఫ్.ఎ చదువుతున్న రోజులలో వంగ దేశ నాయకుడు బిపిన్ చంద్రపాల్ బ్రహ్మ సమాజం ఉపన్యాసాలు ఇవ్వడానికి మద్రాసు వచ్చినప్పుడు కృష్ణారావుకు ఆయన మీద గురి కుదిరి శిష్యుడుగా మారారు. తర్వాత ఆయనతో కలసి బెంగాల్ వెళ్ళారు. దాదాపు సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత ఇంటికి తిరిగివచ్చి కలకత్తాలో బిపిన్ పాలు, అరవింద ఘోష్, ఠాగూర్ పరిచయ అనుభవంతో 1903లో బందరు తిరిగి వచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు.. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ.లో చేరినప్పుడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యారు.

ముట్నూరి కొంతకాలం “ఆంధ్రభారతి” సాహిత్య పత్రికను కూడా నిర్వహించారు. జాతీయోద్యమ కాలంలో కృష్ణాపత్రిక చురుకుగా వ్యవహరించే రోజుల్లో పత్రిక కార్యాలయంలో రాజకీయ, కళా, సాంస్కృతిక, సాంఘిక విషయాలపై పలు చర్చలు జరిగేవి. సంపాదకుడిగా ఉంటూనే కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారాయన. 1930, 1932, 1943 సంవత్సరాల్లో కృష్ణారావు కారాగారవాసం అనుభవించారు. తన దేశభక్తికి హామీగా ధరావత్తు చెల్లించమని నిర్బంధించిన పాలకులను బాహాటంగా ధిక్కరించిన సాహసి కృష్ణారావు. కృష్ణారావు ముఖ్యమైన లక్షణం స్వతంత్ర వర్తనం.

మద్రాసులో సహాధ్యాయుడైన పట్టాభి కృష్ణారావును రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతగా ముగ్గులోకి దించాలని శతధా కృషి చేసినా పుట్టిన గడ్డకీ, పెంచిన ప్రజలకీ దూరమయిపోవడం కృష్ణారావుకు ఇష్టంలేక తన కార్యకలాపాలను జిల్లా స్థాయికి పరిమితం చేసుకున్నారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొమర్రాజు లక్ష్మణరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, టంగుటూరి ప్రకాశం తదితరుల కోవకే చెందిన ప్రజ్ఞావంతుడు ముట్నూరి. విద్యారంగం, సాహిత్యం, పత్రికా రచన, జాతీయోద్యమం, నాటక రంగం తదితర క్షేత్రాల్లో తమ ప్రతిభ ప్రదర్శించారు.

లోతయిన ‘లోవెలుగులు’ ప్రసరింపచేసిన జ్ఞాన భాస్కరుడాయన. కాటూరి వెంకటేశ్వరరావు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రి, అడివి బాపిరాజు, పింగళి నాగేంద్రరావు, పువ్వాడ శేషగిరిరావు, మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రి, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, చింతా దీక్షితులు ‘కృష్ణాపత్రిక’ కార్యాలయాన్ని నిత్యం అలరించే దర్బారీయులు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి, చిత్తూరు నాగయ్య తదితరులు తరచు కృష్ణారావు దర్శనం చేసుకుంటూ వుండేవారు. కృష్ణాపత్రిక కార్యాలయంలో వీరి గోష్ఠిని సాహితీవేత్త అడివి బాపిరాజు ‘కృష్ణరాయ దర్బార్’ అనేవారు.

కృష్ణారావు మంచి హాస్య ప్రియులు కూడా. పత్రికల స్థాయి, ప్రమాణాలు తగ్గి, ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ పార్టీకి కరపత్రంగా తయారయిన ఈ రోజుల్లో పత్రికా సంపాదకులు కృష్ణారావు పాటించిన నీతి, నిజాయితీలను ఆదర్శంగా తీసుకోవాలని విలువలు కోరుకునేవారు ఆశిస్తారు. కృష్ణాపత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ వికాసానికి కృషిచేసిన మహనీయుడు 1945 జూన్ 25న దేహం చాలించారు


(నందిరాజు సీనియర్ జర్నిస్టుల. కాలమిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు)

Tags:    

Similar News