విదేశీ పక్షుల రాకతో పులకించిన బర్డ్ వాచర్స్

జలకళతో నిండిన సరస్సులు సైబేరియా, మంగోలియా,యూరప్,ఆసియా ప్రాంతాల నుంచి హైదరాబాద్ ప్రాంతానికి వలస వచ్చిన రంగురంగుల పక్షులతో బర్డ్ వాచర్స్ పులికించి పోతున్నారు.

Update: 2024-10-18 10:30 GMT

సుదూర విదేశాల నుంచి ఎగురుతూ హైదరాబాద్ ప్రాంతానికి వలస వచ్చిన వివిధ రకాల విదేశీ పక్షల కిలకిల రావాలతో పక్షి ప్రేమికులు పులకించి పోతున్నారు.ఈ ఏడాది సెప్టెంబరు నుంచి సైబీరియా, మంగోలియా ప్రాంతాల నుంచి రకరకాల విదేశీ పక్షులు హైదరాబాద్ ప్రాంతానికి వలస వచ్చాయి. విదేశీ పక్షుల రాకతో తెలంగాణలోని బర్డ్ వాచర్స్ వాటిని క్లిక్ మనిపించి ఆయా ఫొటోలను ఐ నాచురలిస్ట్, ఈ బర్డ్ యాప్ లలో పోస్టు చేస్తున్నారు.


బర్డ్ వాచర్స్ సందడి (ఫొటోలు క్రెడిట్ : బర్డ్ వాచర్ శ్రీరాంరెడ్డి)


వీకెండ్స్ లో బర్డ్ వాచర్స్ సందడి

వీకెండ్స్ లో బర్డ్ వాచర్స్ వాచింగ్ గేర్, కెమెరా, బైనాక్యులర్స్, ట్రైపాడ్స్, గైడ్ బుక్స్ తీసుకొని పక్షులు సందడి చేస్తున్న సరస్సుల చెంతకు వస్తున్నారు. దశాబ్ద కాలంగా బర్డ్ వాచర్ అయిన శ్రీరాం రెడ్డి ఉస్మాన్ సాగర్ సరస్సు వద్ద గ్రేటర్ ఫ్లెమింగో పక్షిని గుర్తించి దాన్ని క్లిక్ చేశారు. యూరప్ నుంచి వచ్చిన పలు రకాల పక్షలు జహీరాబాద్ పరిసర ప్రాంతాల సరస్సులకు తరలివచ్చాయి.వీటితోపాటు దక్షిణాఫ్రికా పక్షులు కూడా తెలంగాణకు వచ్చాయని పక్షి ప్రేమికుడు శ్రీరాం రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరానికి చెందిన మరో బర్డ్ వాచర్ అక్షిత జైన్ కూడా వలస పక్షులను చూడటమే కాకుండా వాటి చిత్రాలు తీశారు.


సంతానోత్పత్తికి అనువైనది...
తెలంగాణలో శీతాకాలం వలస పక్షులకు నిలయంగా మారింది. వలస పక్షుల సంతానోత్పత్తికి హైదరాబాద్ ప్రాంతం అనువైనది.‘‘ ప్రతి సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల సరస్సుల్లో వలస పక్షులను గమనిస్తున్నామని బర్డ్ వాచర్ శ్రీరాంరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.యూరోపియన్ పక్షులు హిమాలయాలను దాటి సుదీర్ఘ దూరం ప్రయాణించి హైదరాబాద్ వచ్చాయని ఆయన చెప్పారు.శీతాకాలంలోని ఈ చల్లని ప్రాంతాల్లో పక్షులకు ఆహార లభ్యత ఉందన్నారు.

అరుదైన పక్షులు ప్రత్యక్షం
కొత్తగూడెం కవాడిగుండ్ల ఫారెస్ట్ రేంజిలో బ్రౌన్ వుడ్ పక్షి కనిపించింది. మహబూబాబాద్ జిల్లాలోని భీమునిపాదం జలపాతం వద్ద, వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో యూరోపియన్ హాని పక్షి,మరో అరుదైన పక్షి కనిపించిందని బర్డ్ వాచర్స్ చెప్పారు.

తెలంగాణకు యూరోపియన్ పక్షుల వలస
ప్రతి సంవత్సరం శీతాకాలంలో లక్షలాది వలస పక్షులు యూరప్, ఉత్తర ఆసియా, చైనా,హిమాలయ ప్రాంతాల నుంచి దక్షిణ భారత రాష్ట్రాలైన తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌లకు అసాధారణ ప్రయాణాన్ని ప్రారంభించాయి. పక్షుల వలసలు వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు, పక్షులు, ప్రకృతి ఔత్సాహికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విదేశీ పక్షుల రెక్కల అందాలకు బర్డ్ వాచర్స్ పరవశించి పోతున్నారు.కొన్ని జాతుల విదేశీ పక్షులు వేల కిలోమీటర్ల దూరం ఎగురుతూ, తమ ప్రయాణాన్ని కొనసాగించి తెలంగాణలోని చిత్తడి నేలలు, అడవులు,వన్యప్రాణుల అభయారణ్యాలు, సరస్సులకు తరలివచ్చాయి.



తెలంగాణలో వలస పక్షుల జాతులు

తెలంగాణలోకి వలస పక్షుల రాక సాధారణంగా రుతుపవనాలు తగ్గుముఖం పట్టడం, చలికాలం ప్రారంభం కావడంతో ప్రారంభమైంది. యూరప్, ఉత్తర ఆసియా, హిమాలయాల నుంచి వివిధ జాతుల పక్షులను ఈ ప్రాంతంలో చూడవచ్చంటారు బర్డ్ వాచర్స్.
ఇసాబెల్లిన్ వీటర్: ఐరోపా,మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన విభిన్న జాతుల్లో ఇసాబెల్లిన్ వీటర్ ఒకటి. లేత గోధుమ రంగు ఈకలు, నిటారుగా ఉండే భంగిమకు ప్రసిద్ధి చెందిన ఈ పక్షిని వికారాబాద్ జిల్లాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాజశేఖర్ ముద్దం తన కెమెరాలో బంధించారు.
గ్రే వాగ్‌టైల్: సన్నని, చురుకైన పక్షి, గ్రే వాగ్‌టైల్ దాని ప్రకాశవంతమైన పసుపు అండర్‌పార్ట్‌లు,పొడవాటి తోక ద్వారా సులభంగా గుర్తించవచ్చు. ఐరోపా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల నుంచి శీతాకాలంలో భారతదేశానికి వలస వచ్చాయి. ఈ పక్షి తెలంగాణలోని నీటి వనరుల దగ్గర తరచుగా కనిపిస్తుంది.
ఆసియన్ బ్రౌన్ ఫ్లైక్యాచర్: ఉత్తర ఆసియా నుంచి వలస వచ్చిన ఆసియన్ బ్రౌన్ ఫ్లైక్యాచర్ తెలంగాణ అడవుల్లో కనిపించింది. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ శ్రీరామ్ రెడ్డి ఇటీవల నర్సాపూర్ ఫారెస్ట్‌లో ఈ చిన్న, బూడిద-గోధుమ రంగు పక్షుల్లో ఒకదాన్ని చూశారు.ఆసియన్ బ్రౌన్ ఫ్లైక్యాచర్ గాలిలో కీటకాలను పట్టుకొని తింటోంది.
గ్రీన్ వార్బ్లర్: గ్రీన్ వార్బ్లర్ ఒక చిన్న, ఆకుపచ్చని పక్షి. ఇది మధ్య ఆసియా, ఐరోపాలోని దాని సంతానోత్పత్తి ప్రదేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చింది. ఉల్లాసమైన, శ్రావ్యమైన పాటకు పేరుగాంచిన ఈ పక్షి పక్షి ప్రియులకు ఎంతో ఇష్టమైనది.
టిబెటన్ ఇసుక ప్లవర్: మెదక్ జిల్లాలోని పోచారం వన్యప్రాణుల అభయారణ్యంలో టిబెటన్ ఇసుక ప్లవర్ పక్షిని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ శ్రీరామ్ ఆదిత్య చూశారు.ఈ పక్సి ఇసుక-గోధుమ రంగుతో పొట్టి కాళ్ళతో ఉంది.

తెలంగాణాలో వలస పక్షుల హాట్‌స్పాట్‌లు
తెలంగాణలోని విభిన్న ప్రకృతి దృశ్యాలు, చిత్తడి నేలలు,సరస్సుల నుంచి అడవులు, గడ్డి భూములు వలస పక్షులకు అనువైన బహుళ నివాసాలను అందిస్తున్నాయి. వలస సమయంలో పక్షులకు అవసరమైన ఆహారం, ఆశ్రయం, విశ్రాంతి ప్రదేశాలను అందిస్తున్నాయని పక్షి ప్రేమికుడు శ్రీరాం రెడ్డి చెప్పారు.
మెదక్ జిల్లాలోని పోచారం వన్యప్రాణుల అభయారణ్యం వలస పక్షులకు స్వర్గధామంగా నిలిచింది.చిత్తడి నేలలు, అటవీ ప్రాంతాలతో, అభయారణ్యం టిబెటన్ ఇసుక ప్లవర్, ఇతర జాతుల పక్షులకు అనువైన పరిస్థితులను అందిస్తుంది.మెదక్ జిల్లా నర్సాపూర్ ఫారెస్ట్ ప్రత్యేకించి ఆసియన్ బ్రౌన్ ఫ్లైక్యాచర్ వంటి వలస జాతుల పక్షులకు నిలయం. సంగారెడ్డిలోని మంజీర జలాశయం చుట్టూ కేంద్రీకృతమై ఉన్న ఈ అభయారణ్యం వలస జాతులతో సహా పెద్ద సంఖ్యలో నీటి పక్షులకు నిలయంగా మారింది.చిత్తడి నేలలు గ్రే వాగ్‌టైల్ మోంటాగుస్ హారియర్ వంటి పక్షులను ఆకర్షిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా యెంకటాల మరో ముఖ్యమైన పక్షుల గమ్యస్థానం. యెంకటాలలో ఇసాబెల్లిన్ వీటర్ పక్షులను వీక్షించవచ్చు.


Tags:    

Similar News